Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార చివరి ఘట్టంలో రాష్ట్ర ప్రజలకు సందేశమిచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనలేకపోయారు. కానీ ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల ముందు ఒక వీడియో సందేశం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సోనియా గాంధీ కీలక విజ్ఙప్తి చేశారు.
తెలంగాణ ప్రజల పేరిట సోనియా గాంధీ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. ” ప్రియమైన సోదర సోదరీమణులారా ఆరోగ్య రీత్యా నేను మీ దగ్గరకు రాలేకపోతున్నాను.. కానీ మీరందరూ నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ పోరాట అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం నేను చూడాలనుకుంటున్నా.. దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కలలు సాకారం అవ్వాలి.. మీకు ఒక మంచి ప్రభుత్వం లభించాలి. సోనియమ్మ అని నన్ను ఆప్యాయంగా పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు.. మీ ప్రేమాభిమానాలకు ఎప్పటికి నేను మీకు రుణపడి ఉంటాను. తెలంగాణ బిడ్డలందరీకీ నా ఒకే ఒక విన్నపం.. మీ అందరి జీవితాలు బాగుపడాలి.. అందుకోసం మార్పు రావాలి. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓటేయండి” అని అన్నారు.
తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా గాంధీకి మంచి గుర్తింపు ఉంది. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీతో ఫినిషింగ్ టచ్ ఇప్పించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ సోనియా గాంధీ ఆరోగ్య కారణాల రీత్యా ప్రచారానికి రాలేకపోయారు. కానీ వీడియో సందేశం ద్వారా ఆమె రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఇది తప్పకుండా కలిసివస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.