BRS : ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరింది. అన్ని పార్టీల నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, నేతల్ని గ్రామాల్లో ఘనంగా ఆదరిస్తున్న ప్రజలు, అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని రావద్దు అంటున్నారు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో బీఆర్ఎస్ కు ఎదురుగాలి తప్పేలా లేదని అంటున్నారు.
ముఖ్యంగా మంత్రులను కూడా గ్రామాల్లోకి రావద్దని అనడంతో ఎవరికేం చేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తమకి ఎదురేలేదని తిరిగిన ఎమ్మెల్యేలు, జరుగుతున్న పరిణామాలను చూసి జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది వారు కలలో కూడా ఊహించని పరిణామంగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈస్థాయిలో రైజ్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యిన తర్వాత పార్టీలోకి ఒక స్పార్క్ వచ్చినట్టయ్యింది. అదే సమయంలో కేసీఆర్ ఒంటెత్తు పోకడలు కొంప ముంచాయి. ముఖ్యంగా ధరణి పోర్టల్ కొత్త తల నొప్పులను తెచ్చింది. ఎవరి భూమి ఎక్కడుందో, ఎవరిది పోయిందో, ఎవరిది ఉందో కూడా తెలీని పరిస్థితి వచ్చింది.
ఇద్దరు అన్నదమ్ములు సమానంగా పంచుకున్న పొలంలో ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అన్నట్టు పాస్ పుస్తకాలు వచ్చాయి. దీంతో వారు లబోదిబోమంటూ ధరణి కార్యాలయానికి వస్తే, మాకు సంబంధం లేదు పొమ్మన్నారు.
మరోచోట అన్నదమ్ముల పొలంలో అన్నకి పాస్ పుస్తకం ఇవ్వలేదు. తమ్ముడికిచ్చారు. దీంతో వాడు ఇదంతా నాదే, నాన్నకి నేనంటేనే ఇష్టం, నాకే రాసిచ్చాడు, అందుకే నాపేరు మీద వచ్చింది. నువ్వేమైన అడగాలంటే సచ్చిపైలోకాల్లో ఉన్న ఆయన్ని అడగమని గొడవలు.
మరికొన్ని చోట్ల ఆడపిల్లకి కట్నంగా ఇచ్చిన పొలం అమ్మాయికి వెళ్లకుండా, అబ్బాయి పేరు మీదే ఉండిపోవడం, దాంతో వాళ్లు ససేమిరా.. ఇవ్వమని చెప్పడం.. ఇలా ఒకటి కాదు న్యూసెన్సులు, ప్రతి ఇంట్లో ఆస్తి తగాదాలే.
బాబూ.. పొరపాటు వచ్చింది. తప్పు సరిదిద్దమంటే అధికారుల్లో ఒక్కడు దిద్దిన పాపాన పోలేదని రైతులు మండిపడుతున్నారు. ధరణి ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరిగామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఇదొక్కటే కాదు మౌలిక సౌకర్యాల కల్పన అత్యంత దారుణంగా ఉంది. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, కరెంటు సమస్యలు, ఆసుపత్రుల్లో వైద్యసేవలు, పిల్లల చదువులు, మూసేసిన బడులు, ఇలా ఒకటికాదు అన్నింటా సమస్యలతో ప్రజలు విసుగెత్తిపోయారు.
దళిత బంధు పదిమందికివ్వడం, దానికోసం వందమంది కొట్టుకోవడం, అన్నింటా ఇవే గొడవలు, ఘర్షణలు, తిట్లు, అరుపులు, కేకలు పదేళ్ల నుంచి రావణకాష్టంలా తెలంగాణ రగులుతూనే పోయింది. అదే ఇప్పుడు ప్రజా వ్యతిరేకతగా మారి జనం తిరగబడే స్థితికి వచ్చిందని అంటున్నారు.
సీఎం సభల తర్వాత కూడా నిరసనలు ఆగలేదు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరిలో వ్యతిరేకత కట్టలు తెగుతోంది. అందుకే బీఆర్ఎస్ నేతలని గ్రామాల్లోకి రావద్దంటూ అడ్డుకుంటున్నారు. ఆఖరికి సీఎం తనయుడు మంత్రి కేటీఆర్ కి ఆ వ్యతిరేకత తప్పలేదు.
అందరికన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించి మూడు నెలల నుంచి ప్రచారం మొదలు పెట్టినా బీఆర్ఎస్ కి ఎదురుగాలి తప్పడం లేదు.ఈసారి వార్ వన్ సైడ్ అయ్యేలాగే కనిపిస్తోందంటున్న. కాంగ్రెస్ జెండా ఎగిరేలాగే కనిపిస్తోందని టాక్ నడుస్తోంది.