Revanth Reddy Domakonda | పదేళ్ల నుంచి ప్రజలకు మోసం చేసిన కేసీఆర్కు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని.. అందరూ ఒక్కతాటిపై వచ్చి కాంగ్రెస్కు ఓటేస్తేనే అది సాధ్యమవుతుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ విజయభేరి రోడ్ షోలో కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతకుముందు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు కాంగ్రెస్ ఇండ్ల పట్టాలు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ పదేళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆశలు చూపి.. ఇంతకు వరకు ఎవరికీ ఇవ్వలేదని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయాల్లో ఉంటూ ఏనాడూ కామారెడ్డికి పట్టించుకోని కేసీఆర్ ఈరోజు కామారెడ్డి పక్కన కోనాపూర్ మా అమ్మమ్మగారి ఊరు అందుకే పోటీచేస్తున్నానని కల్లిబుల్లి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అసుల దోమకొండ, కామారెడ్డి ప్రాంతాలలో పచ్చని భూములను దోచుకునే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నాడని ఆరోపించారు.
కేసీఆర్కు ఓటేస్తే ఆయన గెలిచినా ఎవరితో కలవడు.. ఫామ్హౌస్లో నిద్రపోతుంటాడని చెప్పారు. ప్రజలు ఓటేసిన వ్యక్తి.. అందరికీ అందుబాటులో ఉండాలని.. ప్రజల కష్టాలు, సమస్యలు గురించి తెలుసుకొని పరిష్కరించే విధంగా ఉండాలన్నారు. ఏ పార్టీ నాయకులు డబ్బులిచ్చినా.. దావత్లు ఇచ్చినా.. వారికి ఓటు వేయద్దు.. కాంగ్రెస్కి మాత్రమే ఓటేయాలని కోరారు. ఇవాళ మహిళలు గ్యాస్ సిలిండర్లు కొనలేక మళ్లీ కట్టెలపొయి మీద వంట చేయాల్సి వస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయంలో సోనియా గాంధీ అందరికీ రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తే ఈ రోజు కేసీఆర్, మోదీ ప్రభుత్వాలు రూ.1300 చేశాయని.. విపరీతంగా పెరిగిన ఈ ధరలతో ప్రజల బతుకులు నలిగిపోతున్నాయని చెప్పారు.
పేదల ఇండ్లలో పెళ్లిళకు ప్రతి ఇంటికీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్షతో పాటు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతు బంధు ఇస్తామని కేసీఆర్. హరీష్ రావులు రైతులకు మోసం చేశారని మండిపడ్డారు. రైతు బంధు పథకం కింద ప్రతి రైతుకు ప్రతి ఏడాది రూ.15000 ఇస్తామని.. డిసెంబర్ నెల నుంచే అమలు చేస్తామని అన్నారు. భూమి లేని పేదలకు రూ.12000 ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. పేదలందరికీ ఉచితంగా కరెంటు ఇస్తామని అన్నారు. ఇల్లు లేని పేదవాళ్లకి ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. వృద్ధులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ హామీలన్నీ అమలు చేయాలంటే.. కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని ప్రజలను కోరారు.