Telangana Elections : తెలంగాణ ఎన్నికల సందర్భంగా నుంచి మూడు రోజులపాటు మద్యం షాపుల్లో గ్లాసుల గలగలలు ఇక వినిపించవు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత మద్యం దుకాణాలన్నీ బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. విషయం తెలిసిన వెంటనే మందు బాబులు ఒక్కసారిగా పొలోమని మద్యం దుకాణాలపై పడ్డారు. ఎక్కడ చూసినా ఒకటే రద్దీగా కనిపిస్తున్నాయి.
మద్యం షాపులన్నీ ఫుల్ రష్ గా ఉండటంతో, ఈ బ్రాండ్, ఆ బ్రాండ్ అని లేదు, రమ్, జిన్, వోడ్కా అనేదేమీ లేదు. ఏది పడితే అది, ఎంత పడితే అంత ఇచ్చి కొనుక్కొని, కౌన్ బనేగా కరోడ్ పతీలో కోటి రూపాయలు కొట్టినంత ఆనందంగా ముఖాలు పెట్టి, వీరాధివీరుడిలా బైక్ తీసుకుని, హెల్మెట్ పెట్టుకుని, బాటిల్ పట్టుకుని వెళ్లిపోతున్నారు.
తెలంగాణ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. సాయంకాలం 5 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను పెంచారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ముఖ్యంగా మద్యం దుకాణాలను నేటి నుంచి 3 రోజుల పాటు మూసివేయనున్నారు.
నేటి సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి. ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా తెరిస్తే మాత్రం లైసెన్స్లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు ఉంటాయని ఈసీ హెచ్చరించింది.
కాకపోతే ఇప్పటికే జరగాల్సిన తంతు అంతా జరిగిపోయిందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రమంతా మద్యం బాటిళ్లు ఇంటింటికి చేరిపోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు ఓటుకి రూ.1500 నుంచి రూ.3000 వరకు ఇస్తున్నట్టు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
వీటితో పాటు మహిళలకు మంచి పర్సులు అందులో రూ.2000 నగదుతో సహా వెళుతున్నాయని చెబుతున్నారు. ఈ పర్స్ లను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి తీసుకొచ్చారని అంటున్నారు. ఏనోటా విన్నా ఒకటే మాట వినిపిస్తోంది.
తెలంగాణ ఎన్నికల సిత్రాలు..
ఇన్నిన్ని కాదయా..విశ్వదాభిరామ..
వినరా నాయనా.. అంటున్నారు.