2025 లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, పాకిస్తాన్ నుంచి వేరే దేశానికి తరలిపోనుందా? అంటే అవుననే అంటున్నారు. అందుకు కారణం…భారత్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. వీరి వల్లే పాకిస్తాన్ లో జరగడం లేదని ఆక్రోశిస్తున్నారు. భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించేందుకు ఒప్పుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇండియా-పాక్ మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తూనే ఉంది. మొన్నటికి మొన్న ఆసియా కప్ జరిగినప్పుడు కూడా పాక్ గడ్డపైకి వచ్చి భారత్ ఆడదని గట్టిగా నిలబడ్డారు. దాంతో
భారత్ ఆడే మ్యాచులన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. ఇది ఆర్థికంగా పాకిస్థాన్కు ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే ఎక్కడికెళ్లినా ఇండియా ఆడే మ్యాచ్ లకు బ్రహ్మండమైన డిమాండ్ ఉంది.
అందుకు కారణం…వరల్డ్ క్లాస్ బ్యాటర్లు టీమ్ ఇండియాలో ఉన్నారు. ముఖ్యంగా విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా, షమీ, సూర్య, ఇలా ప్రతీ ఒక్కరికి ఒకొక్క బ్రాండ్ ఇమేజ్ ఉంది. వీరి ఆట చూసేందుకైనా స్టేడియంకు అభిమానులు తరలివస్తారనేది ఒక నిజం.
టీమ్ ఇండియాతో మ్యాచ్ లు అంటే 140 కోట్ల మంది భారతీయుల్లో ఎంతమంది చూస్తారనేదానికి లెక్కే లేదు. వీటికి భారీగా శాటిలైట్ రైట్స్ ఉంటాయి. ఇండియాతో ఆటంటే కోట్లాది రూపాయల లాభాలతో కూడుకున్నదై ఉంటుంది.
అందుకే పాకిస్తాన్ కారాలు మిరియాలు నూరుతుంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ వేదికగా జరిగేది అనుమానంగా మారింది. ఒకవేళ మారితే ఎక్కడ పెడతారనేది ఇంకా క్లారిటీ రాలేదు. భద్రతా కారణాలంటే ఒకటి గ్రౌండ్ లో అభిమానుల నుంచైనా కావచ్చు, లేదా హోటల్స్, ఎయిర్ పోర్ట్స్, బస్సుల్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఎన్నో కారణాలు చెబుతున్నారు. ఎన్నో చెప్పలేని ఆందోళనలు కూడా ఉన్నాయని అంటున్నారు.
పాకిస్తాన్ మ్యాచ్ లు ఆడేందుకు ఇండియా వచ్చినప్పుడు ఆ ఇబ్బందుల్లేవు గానీ, భారత జట్టు వెళితే మాత్రం వీరాభిమానుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఒకవేళ భద్రతా కారణాలు చెప్పి 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు రాకపోతే మాత్రం, పరిహారం ఇవ్వాలని ఐసీసీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరినట్లు సమాచారం.