Azam Khan : పాలస్తీనాకు మద్దతుగా బ్యాట్ మీద ఆ దేశ జెండాను అతికించుకుని వికెట్ కీపర్ అజం ఖాన్ క్రీజులోకి వచ్చాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి నచ్చలేదు. వెంటనే అతని మ్యాచ్ ఫీజులోంచి 50 శాతం కోత విధించింది.
దీంతో మైండ్ బ్లాక్ అయిన ఆజంఖాన్ ఆశ్చర్యపోయాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమంటే ఇదేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకు ముందు వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ రిజ్వాన్ సెంచరీ కొట్టాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం తన సెంచరీని పాలస్తీనియన్లకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు.
అప్పుడతనిపై పీసీబీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఘోల్లు మంటున్నాడు. అంతేకాదు ఇలా బ్యాట్ కి అతికించుకు రావడం, ఇది రెండోసారని కూడా చెబుతున్నాడు. అదేదో మొదటిసారి చెప్పి ఉంటే, రెండోసారి ఈ పనిచేసి ఉండేవాడిని కాదు కదా అంటున్నాడు. అక్కడ రిజ్వాన్ కి ఒక న్యాయం, ఇక్కడ నాకొక న్యాయమా? అప్పుడు ఐసీసీ నిబంధన గుర్తుకు రాలేదా? అని సన్నిహతుల వద్ద ఆజంఖాన్ వాపోతున్నట్టు సమాచారం.
ఇంతకీ ఇదెప్పుడు జరిగిందంటే కరాచీలో నేషనల్ టీ 20 క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. టోర్నమెంట్లో కరాచీ వైట్స్ తరఫున ఆజం ఖాన్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో బ్యాట్ మీద పాలస్తీనా జెండాతో ఆజంఖాన్ క్రీజులోకి వచ్చాడు. దీంతో పీసీబీ సీరియస్ అయ్యింది. ఐసీసీ క్లాథింగ్ అండ్ ఎక్విప్మెంట్ రెగ్యులేషన్స్ ఉల్లంఘించాడనే కారణంతో చర్యలు తీసుకుంది. ఆజం ఖాన్ మ్యాచ్ఫీజులో 50 శాతం కోత విధించింది.
ఆరోజు రిజ్వాన్ పాలస్తీనాకు అంకితం అన్నప్పుడు పీసీబీ ఏం మాట్లాడిందంటే పాలస్తీనాకు తాము మద్దతుగా నిలుస్తున్నామని, అది తమ వ్యక్తిగత అంశమని తెలిపింది. మరిప్పుడెందుకు ఆజాంఖాన్ కి కోత విధించింది, ఒకొక్క ఆటగాడిపై ఒకొక్క విధంగా వ్యవహరించడం పీసీబీకి తగని పని అంటూ నెటిజన్లు దుయ్యబడుతున్నారు.
ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలీదని, ఎవడూ అడగకూడదని, అడిగితే తొక్కేస్తారని, అంతా మూడ్స్ మీద అక్కడ పరిపాలన సాగుతుంటుందని కామెంట్ చేస్తున్నారు. వారు నవ్వితే నవ్వాలి, వారు ఏడిస్తే ఏడ్వాలి అని తిట్టిపోస్తున్నారు.