దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం (నవంబర్ 29) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. మరోవైపు ఏపీలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. కాగా.. ఇంకొక్క నెలరోజుల్లో పంట చేతికొస్తుందనగా.. అకాల వర్షసూచన రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. వర్షాలు పడితే పంటంతా వర్షార్పణమైపోతుందని ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడా పడుతున్న వర్షాలతో.. కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి.. వాటిని ఆరబెట్టుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతన్న దిగులు చెందుతున్నాడు.