జనంలోకి వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. మరోవైపు నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. అలాగే మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా సమావేశమై భవిష్యత్ వ్యూహాలపై ఓ నిర్ణయానికి వచ్చారు.
ర్యాలీలు, రాజకీయపరమైన సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని హైకోర్టు సూచించింది. కోర్టు ఉత్తర్వులతో చంద్రబాబు రాక కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారం నుంచి ఆయన పూర్తిస్థాయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
డిసెంబర్ 1న చంద్రబాబు తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రానికే తిరుమల చేరుకోనున్న ఆయన రాత్రి కొండ మీద బస చేయనున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనం అయ్యాక రేణిగుంట విమానాశ్రయం నుంచి అమరావతి చేరుకుంటారు. ఆ తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లికార్జున స్వామివార్ల దేవాలయాల్ని సందర్శిస్తారు.
సెప్టెంబర్ 9న భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పర్యటనలో ఉండగా చంద్రబాబును స్కిల్ కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు జైలుకి వెళ్లడంతో టీడీపీ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 53 రోజులు రిమాండ్ లో ఉన్నారు. ఎట్టకేలకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో ఆయన జనంలోకి వచ్చేందుకు నడుం బిగిస్తున్నారు.
మరోవైపు ఆయన ఢిల్లీ ప్రయాణం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీం న్యాయవాది సిద్దార్ధ లూథ్రా కుమారుడి వివాహ రిసిప్షెన్ కు సతీమణితో కలిసి హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం వరకు ఉండి, తిరిగి హైదరాబాద్ రానున్నారు.
ఈ మధ్యలో ఢిల్లీలో పెద్దలను కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీతో కలిసి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో అలాంటి సీన్ మళ్లీ ఏమైనా రిపీట్ అవుతుందా? అని అంతా ఆసక్తికరంగా చూస్తున్నారు.