Postal Ballot Issue : ఎన్నికల ప్రక్రియలో ప్రతీ ఓటు కీలకమే. అందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రభుత్వంపై ఉద్యోగుల స్పందనకు కొంతమేర కొలమానంగా భావిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పడ్డాయంటే ఫలితాలు ప్రతికూలంగా వస్తుందనే సంప్రదాయం ఉంది. అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్ల దగ్గర్నుంచే పాలిటిక్స్ చోటు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది. తమకు పోస్టల్ ఓటు హక్కు కల్పించలేదంటూ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు సీఈఓ వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేలా చూడాలని కోరగా సానుకూల స్పందన లభించింది. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారమే ఇలా ఉంటే ఎలక్షన్ ప్రక్రియపై మరింత అప్రమత్తంగా ఉండాలనే సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
తెలంగాణలో పోలింగ్కు ముందే ఎన్నికల అధికారుల అలసత్వం బయటపడుతోంది. ఇప్పటికే ఈసీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. పోస్టల్ బ్యాలెట్పై ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది ఆందోళనకు దిగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ రిజక్ట్ కావడం వెనక అధికార పార్టీ హస్తం ఉందని మండిపడుతున్నారు. 20 రోజుల ముందే అప్లై చేసుకున్నా రిజెక్ట్ అయిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు 1,68,612 మందికి పోస్టల్ బ్యాలెట్ ఓటుకు ఈసీ ఆమోదం తెలిపింది. అయితే రిజెక్ట్ అయిన వారి సంఖ్య అధికంగా ఉందని సిబ్బంది అంటున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద మతలబు జరిగిందని ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది చెబుతున్నారు. ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వెంటనే ఈసీ కలగచేసుకోవాలని డిమాండ్ చేశారు.
పోస్టల్ బ్యాలెట్ల రగడ సీఈవో వికాస్రాజ్ వద్దకు చేరింది. తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు ఈ మేరకు వికాస్రాజుకు ఫిర్యాదు చేశారు. దాదాపు లక్ష మందికి పోస్టల్ బ్యాలెట్ అందలేదని వివరించారు. ఓటు విలువ తెలిపే తమకే అవకాశం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఓటు వేసే అవకాశం కల్పిస్తామని సీఈవో హామీ ఇచ్చారు. మెదక్, నల్గొండతో పాటు చాలా చోట్ల ఓట్లు కలిగిన ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ కల్పిస్తుంది. కానీ, కొంత మందికే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి మిగితా వారికి ఇవ్వలేదని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన సీఈఓ 28వ తేదీ వరకు అందరికీ పోస్టల్ బ్యాలెట్ అందిచి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పై గందరగోళం కొనసాగుతోంది. ఈ సమస్యపై పలు చోట్ల ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 119 సెగ్మెంట్లలో దాదాపు 3 లక్షల మంది ఎలక్షన్ డ్యూటీలో ఉండగా.. అందులో 1 లక్ష 60 వేల మందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసేందుకు ఈసీ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 56 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకున్నారు. 29వ తేదీ లోపు మరో లక్ష మంది ఎలక్షన్ సిబ్బంది తమ ఓట్లను వినియోగించుకోనున్నారు.
ఆర్వోలకు ట్రైనింగ్లో చెప్పింది ఒకటైతే..గ్రౌండ్లో ఇంకో తీరులో పోస్టల్ బ్యాలెట్ ఓటు ప్రక్రియ జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు నియోగించుకోకుండా కొందరు అడ్డుపడుతున్నారని.. చాలాచోట్ల ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈసారి అంగన్వాడీలకు కూడా ఈసీ ఎన్నికల విధులను అప్పగించింది. వారికి సొంత పోలింగ్ స్టేషన్ల పరిధిలో కాకుండా ఇతర కేంద్రాల్లో విధులు కేటాయించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 30 వేలకు పైగా అంగన్వాడీలు, ఇతర సిబ్బంది పోస్టల్ ఓటు హక్కు వినియోగించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకే.. ఓటు హక్కు అవకాశం లేవకవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జోక్యం చేసుకొని.. పోస్టల్ బ్యాలెట్ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. లేదంటే ఉద్యోగులు కోరినట్లుగా సాధారణ ఓటు వేయడానికైనా అవకాశం ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు.
తెలంగాణ పోరులో పోలింగ్కు సమయం ఆసన్నంకావడంతో ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈవీఎంలను సిద్ధం చేయగా.. పోస్టల్ బ్యాలెట్ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో లక్షా 68 వేల 612 పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఆమోదం పొందగా.. వారిలో ఇప్పటి వరకు 96 వేల 526 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా మంగళవారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి రానుందన్నారు. ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోనున్నాయి. ఇక ఎలక్షన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సమయం దగ్గరపడటంతో ప్రధాన పార్టీల అగ్రనేతలంతా తెలంగాణకు క్యూ కట్టారు.