Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకే ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 30న పోలింగ్ ఉన్నందున 48 గంటల ముందు నుంచే.. మైక్లు బంద్ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్అమల్లోకి వస్తుంది. సంబంధిత నియోజకవర్గానికి చెందని వారంతా ఆయా నియోజకవర్గాల్లో ఉండరాదని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. దాంతో పలు పార్టీలు చివరి రోజున బహిరంగ సభలతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు పెట్టనున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లు నియోజకవర్గాలను చుట్టేశారు. ఆఖరి ప్రయత్నాల్లో భాగంగా ఊరూవాడల్లో రోడ్షోలు, కార్నర్ మీటింగ్లతో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
నేడు కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ రోడ్ షోలలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు చివరి అంకానికి తెరతీస్తున్నారు. అక్టోబర్ 9న షెడ్యూల్ వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలైంది. అప్పటికే బీఆర్ఎస్.. కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది. తరువాత ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నెల 10న నామినేషన్ల దాఖలు ముగియగా.. విత్ డ్రా తరువాత 15న ఫైనల్ క్యాండిడేట్ల లిస్ట్ను సీఈవో కార్యాలయం ప్రకటించింది. 13 రోజుల నుంచి అభ్యర్థులు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఈ రోజు చివరిరోజు కావడంతో కాంగ్రెస్ అగ్రనేతలంతా ప్రచారాల్లో ఫుల్ బిజీగా ఉండనున్నారు. రోడ్ షో, కార్నర్ మీటింగ్స్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఉదయం పదిన్నరకు జూబ్లీహిల్స్ ఆటో వర్కర్స్ యూనియన్, జీహెచ్ఎంసీ, గిగ్ వర్కర్స్ యూనియన్తో ఇంటరాక్షన్ కానున్నారు. పదకొండున్నరకు నాంపల్లిలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. 2 గంటలకు మల్కాజిగిరి ఆనంద్ బాగ్ చౌరస్తా లో ప్రచారంలో పాల్గొననున్నారు. జహీరాబాద్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. ఈరోజు కామారెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లోరేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కామారెడ్డి పట్టణం, దోమకొండలో రోడ్ షోలో పాల్గొననున్నారు. ఉదయం 10గంటలకు కామారెడ్డిలో రోడ్ షో నిర్వహించనున్నారు. 11 గంటలకు దోమకొండలో రోడ్ షోలో పాల్గొననున్నారు. మల్కాజ్గిరిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రోడ్ షో లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతలంతా.. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు సాద్వి నిరంజన్, భగవత్ కిషన్ రావు సైతం హాజరుకానున్నారు. చివరి రోజు సీఎం కేసీఆర్ వరంగల్, గజ్వేల్లో పర్యటిస్తారు. అక్కడ నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు.