Telangana election live updates:
తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఓటర్ల కు అన్నిరకాలుగా ఎవరి శక్తి మేరకు వారు తాయిలాలు అందించే పనిలో పడ్డారు. ఇంక ప్రచారానికి మంగళవారం సాయంత్రం వరకే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ వివరాలు వెల్లడించింది.
తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. సరిహద్దుల్లో 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా, మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరందరికి సరిపోయేలా 35, 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఈసీ తెలిపింది. ప్రతి కౌంటింగ్ సెంటర్ కు ఒక పరిశీలకుడిని నియమించింది. రాష్ట్రస్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. ఎన్నికల కోసం 36వేల ఈవీఎంలను సిద్ధం చేసింది.
ఈసారి కొత్తగా 51లక్షల ఓటర్ కార్డులు ప్రింట్ చేసి పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపించారు. అంతేకాదు 86శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్లు, టెండర్, ఛాలెంజ్ ఓట్ల కోసం బ్యాలెట్లు కలిపి మొత్తం 14 లక్షలకు పైగా ప్రింట్ చేశారు.
ఈవీఎం, వీవీ ప్యాట్ ల కమిషనింగ్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయ్యింది. 35, 356 పోలింగ్ కేంద్రాలకు 59, 775 బ్యాలెట్ యూనిట్లను రెడీ చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపడుతోంది. అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్నింటికన్నా ముఖ్యంగా హైదరాబాద్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
నవంబర్ 3న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 30 న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మిజోరాంలకు ఎన్నికలు జరగనున్నాయి.