Congress Victory: రాష్ట్రంలో పరిస్థితులు కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయని ఏఐసీసీ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు ఆ పార్టీ నేతలకు తీపి కబురు చెప్పారు. పూర్తి మెజార్టీతో హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని భరోసా ఇచ్చారు. దాదాపు 70 నుంచి 80 సీట్లలో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని వెల్లడించినట్లు సమాచారం. తెలంగాణలో ప్రచారానికి వచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కూడా సునీల్ కనుగోలు ఇదే విషయాన్ని వివరించినట్లు తెలిసింది. ఆదివారం తాజ్ కృష్ణ హోటల్లో కర్ణాటక సీఎంతో భేటీ అయిన సునీల్ కనుగోలు.. తాజా సర్వే రిపోర్టు వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులు, ఆరు గ్యారంటీలపై ప్రజలకు ఏర్పడిందన్నారు. ఈ మేరకు గెలవబోయే నియోజకవర్గాల డీటెయిల్స్ కూడా వెల్లడించారు. తెలంగాణలో అధికారంలోకి రావడం నిశ్చయమని సిద్ధరామయ్య నిర్ధారణకు వచ్చారు. సెగ్మెంట్ వారీగా విజయావకాశాలపై సునీల్ టీమ్ నుంచి ఆరా తీశారు. తెలంగాణ తర్వాత దేశమంతా కాంగ్రెస్ను గెలిపించే కార్యక్రమాలను చేపట్టాలని ఏఐసీసీ అబ్జర్వర్లు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను సిద్ధరామయ్య కోరారు. ఇక తరువాత టాస్క్ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటే అంటూ పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు కర్ణాటక సీఎం గట్టిగా బదులిచ్చారు. కర్ణాటకలో హామీల అమలు చూసేందుకు రావాలంచే స్పందించలేదన్నారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ మరోసారి సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల విజయవకాశాలపై సునీల్ కనుగోలు టీమ్ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తోంది. గతంలో నెలవారీ, వీక్లీ సర్వేలు చేసింది. ఇప్పుడు సునీల్ టీమ్ రోజువారీ నివేదికలు రూపొందిస్తున్నాయి. వివిధ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్లో వస్తున్న మార్పులను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. అభ్యర్ధుల ప్రచార ప్రభావం, ఆరు గ్యారంటీలతో ప్రజల్లో ఏర్పడిన విశ్వాసం అనుకూలిస్తున్న పరిస్థితులను అంచనా వేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత… కాంగ్రెస్ వైపు చేరుతున్న వారి ఓటింగ్ తదితర వివరాలను టీమ్లు సేకరిస్తున్నాయి. ఇంకా గట్టి పోటీ ఉన్న సెగ్మెంట్లలో కాంగ్రెస్ బలం పుంజుకునేలా అభ్యర్ధులను సునీల్ టీమ్లు అలర్ట్ చేస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు కాంగ్రెస్కు అనుకూలంగా మారడం, అసంతృప్తి చల్లారడం.. నియోజకవర్గాల్లో గ్రాఫ్ పెరగడానికి కారణమయ్యాయని సునీల్ టీమ్ విశ్లేషించింది. కొన్ని సెగ్మెంట్లలో ప్రచారంపై దృష్టి తగ్గించి ముందస్తు సంబురాల్లో మునిగిపోయారనే విషయాన్ని పీసీసీ నేతల దగ్గరకు చేర్చింది. కీలకమైన సమయంలో ఈ ధోరణి మంచిది కాదని హెచ్చరించింది. ఎన్నికల చివరి రోజుల్లో మరింత కష్టపడాలని అప్రమత్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసేది కాదని సిద్ధరాయ్య క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి బలమైన వేవ్ ఉందనే ఆత్మవిశ్వాసం మంచిదే అని.. అయితే ఇదే సమయంలో నిర్లక్ష్యంగా ఉండడం తగదని సునీల్ టీమ్ అభ్యర్థుల్ని అలర్ట్ చేసింది. మెజారిటీ నియోజకవర్గాల్లో వార్ వన్సైడ్గానే కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నప్పటికీ దాదాపు 25 నుంచి 30 స్థానాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేలా టఫ్ ఫైట్ నెలకొంది. దీనిని అనుకూలంగా మల్చుకోవడం ఛాలెంజ్గా తీసుకోవాలని అప్రమత్తం చేసింది. ప్రచారం ముసిసిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపైనా పీసీసీ, సునీల్ టీమ్ అభ్యర్థులకు దిశానిర్దేశం చేసింది. పోలింగ్ రోజు వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజల్ని బీఆర్ఎస్ మభ్యపెట్టే అవకాశం ఉందని, ప్రత్యర్థి కదలికలపైనా నిఘా వేసి కౌంటర్ ఇచ్చేలా ఫోకస్ పెట్టాలని సూచించింది. అభ్యర్ధులంతా నియోజకవర్గాల్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తూ.. కీలక స్థానాల్లో లోకల్గా ఉండే పార్టీ లీడర్లతో యాక్షన్ ప్లాన్ను అమలు చేయించే వ్యూహాన్ని టీమ్ సిద్ధం చేసినట్లు తెలిసింది.
మైక్రో లెవల్ పోల్ మేనేజ్మెంట్పైనా సునీల్ కనుగోలు బృందం పలు సూచనలు చేసింది. ఇప్పటివరకు ఉన్న అనుకూల పరిస్థితులను మరింత మెరుగు పరిచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అధికార పార్టీకి పోల్ మేనేజ్మెంట్లో ఉండే అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని దానికి దీటుగా కౌంటర్ స్ట్రాటెజీపై ఫోకస్ పెంచారు. ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ వేవ్.. అధికార పార్టీకి గట్టి షాక్ ఇస్తుందనే కాన్ఫిడెన్స్ నేతల్లో కనిపిస్తోంది.