Bhatti Vikramarka : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలపై ప్రజల్లో నమ్మకం కలిగింది. అదే పార్టీపై విశ్వాసాన్ని పెంచింది. ప్రచారంలోనూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై అఫడవిట్ సమర్పించారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం చొప్పకట్లపాలెం ఆలయంలో రూ.100 స్టాంప్ పేపర్పై సంతకం పెట్టారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని అఫడవిట్ లో భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. తన నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకున్నారు. అక్కడ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. నాలుగోసారి విజయం తనదేనన్న ధీమాతో ఉన్నారు. అలాగే తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.