Hardik Pandya : అందరి ఊహలను తలకిందులు చేస్తూ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి సొంత గూటికి అంటే ముంబై ఇండియన్స్ కి వచ్చేశాడు. ఇది అధికారికంగా ఖరారైంది. దీంతో శుభ్ మన్ గిల్ను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఫ్రాంచైజీ ప్రకటించింది.
ఏడేళ్లు ముంబయి ఇండియన్స్ తరఫున పాండ్యా ఆడాడు. తర్వాత అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ కి వచ్చి కెప్టెన్ అయ్యాడు. అంతేకాదు 2022లో విజేతగా నిలిపాడు. 2023లో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అంత గొప్పగా ఆడిన హార్దిక్ ని గుజరాత్ టైటాన్స్ ఎందుకు వదులుకుందనేది ఒక చిదంబర రహస్యంగా ఉంది. దీంతో హార్దిక్ వచ్చే సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్ కి ఆడనున్నాడు. హార్దిక్ ని ట్రేడింగ్ లో ముంబయి దక్కించుకుంది.
ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా స్పందించాడు. సొంత ఇంటికి వచ్చినట్టుందని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ జట్టుతో సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని అన్నాడు. అవన్నీ గుర్తుకొస్తున్నాయని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.
ఇప్పుడు ఐపీఎల్ అభిమానులకి ఒక సందేహం పట్టి పీడిస్తోంది. అసలెందుకు పాండ్యా ఇటోచ్చాడు. అక్కడ బాగానే ఉంది కదా.. అని అనుమానం పడుతున్నారు. ముంబై ఇండియన్స్ లో చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. మరి అతన్నేం చేస్తారు? ఈ సీజన్ కి తను ఆడటం లేదా? లేదంటే ఐపీఎల్ వదిలేస్తున్నాడా? లేక మొత్తం ఇండియన్ టీమ్ నుంచే రిటైర్మెంట్ తీసుకుంటాడా? అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
ఒక దగ్గర కెప్టెన్ గా పనిచేసి, ఏకంగా ట్రోఫీ తీసుకొచ్చి, రెండోసారి ఫైనల్ వరకు లాక్కెల్లిన పాండ్యా మళ్లీ తిరిగి ముంబై ఇండియన్స్ లో ఒక ఆటగాడిలా ఆడగలడా? ఇవన్నీ పక్కన పెడితే అసలు మార్చి నెలాఖరుకల్లా తను కోలుకుంటాడా? ఎన్నో సందేహాలు అభిమానుల బుర్రల్లో తొలిచేస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ తో ఏమైనా గొడవ పడ్డాడా? అని కొందరంటున్నారు.
వీటన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని, అంతవరకు వెయిట్ అండ్ సీ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. వచ్చేనెల డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం ఉంది, ఆ సమయానికి మరింత క్లారిటీ వస్తుందని కొందరు వ్యాక్యానిస్తున్నారు. ఇది ఇప్పుడిప్పుడే తెమిలే యవ్వారం కాదని కొందరు అంటున్నారు.