Priyanka Gandhi : కొడంగల్ లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో తొలిసారి భేటీ అయిన సందర్భాన్ని ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల పోరాటాన్ని వివరించారని తెలిపారు. పదవి కావాలని కోరలేదన్నారు. రాష్ట్రంలో మార్పు, అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసమే తపిస్తారని ప్రశంసించారు.
ప్రజల కోసం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఉద్యమకారులు ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఉద్యమకారులను గౌరవించాలని సూచించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ రూ. 1600 కోట్లు ఖర్చు చేసి విమానం కొనుక్కున్నారని ప్రియాంక అన్నారు. కానీ యూపీలో రైతుల రుణాలు మాఫీ చేయడానికి మాత్రం డబ్బులేదన్నారు.
బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. గులాబీ నేతలు 10 ఏళ్లలో ప్రజాధనం కొల్లగొట్టారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో అందరీ పదవులు వచ్చాయన్నారు. వారు రాజ భవనాలు కట్టుకుని నివసిస్తున్నారు. కానీ ప్రజల మరింత పేదవారు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యువత ఉద్యోగాలు వస్తాయని ఎదురు చేశారని.. కానీ ఉద్యోగాలు రాలేదన్నారు. దళిత, ఆదివాసీలను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తున్న సీఎంను ఇక్కడే చూస్తున్నామని సెటైర్లు వేశారు.
ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములు దోచుకుంటున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్ మాఫియా రాజ్యమేలుతున్నాయన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటులో తెలంగాణ వచ్చే 5 ఏళ్లు భవిష్యత్తు నిక్షిప్తమై ఉందన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కానీ ప్రజలు తమ జీవితాల్లో మార్పుకోసం కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.