Chevella : ఓట్లు గల్లంతు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల గురించే అంతా చర్చ నడుస్తోంది. సామాజిక మాధ్యమాలన్నీ హోరెత్తిపోతున్నాయి. ఒక జిల్లా నుంచి చూసి మరొక జిల్లా వారు మాకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాలేదని అంటున్నారు. ఇది మొత్తం చైన్ లింక్ లా మారిపోయింది.
మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎన్నికల డ్యూటీలు పడినవారు తమకు ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందలేదని తెలిపారు. ఇంక కొడంగల్, తాండూరు నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులు అయితే చేవెళ్లలో నిరసనకు దిగారు. ఎన్నికల శిక్షణ వద్ద ఇస్తారని కొందరు చెప్పారని, తీరా అడిగితే ఇక్కడికి రాలేదని అంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఏ ఒక్క అధికారి కూడా బాధ్యతగా మాట్లాడటం లేదని చెబుతున్నారు. కొందరైతే ఇక్కడ ఎందుకిస్తారు.. మీరు అన్ లైన్ లో అప్లై చేసుకోండి అని చెబుతున్నారు. అక్కడ అప్లై చేస్తే.. కంగ్రాట్స్ మెసేజ్ తప్ప, వస్తుంది అనిగాని, త్వరలో వస్తుందని గానీ, బయలుదేరింది, మధ్యదారిలో ఉందని గానీ, ఏ సమాచారం లేదని అంటున్నారు.
వరంగల్ పరిధిలోని ఒక పోలీస్టేషన్ లో 11 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అందలేదు. పోలీసులం మాకే అందలేదు.. మీకు ఇంకేం అందుతాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
2.08 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు, 45 వేల మంది రాష్ట్ర పోలీసులు, 50 వేల మంది ఇతర ఉద్యోగులు ఉన్నారని అంటున్నారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం 12 డీ సమర్పించాలని పదేపదే చెప్పామని, నవంబరు 23 వరకు అవకాశమిచ్చామని, చాలామంది దరఖాస్తు చేసుకోలేదని దానికి మేమేం చేసేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కొన్ని దరఖాస్తుల్లో స్పష్టమైన వివరాలు లేవని, అలాంటివన్నీ రిజెక్ట్ అయ్యాయని చెబుతున్నారు.
పోస్టల్ బ్యాలెట్ పై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని, ఈ సమస్యను ఈసీ తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఒక ప్రకటనలో డిమాంఢ్ చేశారు. అవసరమైతే నిబంధనలు సడలించాలని అన్నారు. అంతేగానీ వారి ఓటు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.