PM Modi : తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కరీంనగర్ లో బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలోనే స్మార్ట్ సిటీ కింద నిధులు విడుదల చేసి కరీంనగర్ ను అభివృద్ధి బాట పట్టించామన్నారు. కరీంనగర్ ను లండన్ చేస్తామని కేసీఆర్ అబద్ధపు హామీ ఇచ్చారని విర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై మోదీ స్పందించారు. ఈ ప్రాజెక్టులో ఏం జరిగిందో దేశం మొత్తానికి తెలుసన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా? అని ప్రశ్నించారు. కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగులే మిగిలారని తెలిపారు. కేసీఆర్, ఆయన కుటుంబం లూటీ చేసేందుకు తెలంగాణ వచ్చిందా ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలన డిసెంబర్ 3నతో ముగుస్తుందని స్పష్టం చేశారు.
మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తైయ్యే గ్యారంటీ అని ప్రధాని అన్నారు. బీజేపీతో సామాజిక న్యాయం సాధ్యమని తేల్చిచెప్పారు. మాదిగలకు న్యాయం చేసేందుకు కమిటీ వేశామన్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు. 2024లో బీజేపీకి మళ్లీ పట్టం కట్టేందుకు దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తో వెలుగు వస్తుందన్నారు.
హుజూరాబాద్ ప్రజలు గతంలోనే బీఆర్ఎస్ కు ట్రైలర్ చూపించారని.. ఈ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తారని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని.. బీసీ వ్యక్తే సీఎం అవుతారని స్పష్టం చేశారు. పదేళ్ల బాలుడి తల్లిదండ్రులు అతని భవిష్యత్ కోసం చాలా ఆలోచిస్తారని.. ఇప్పుడు పదేళ్ల వయసున్న తెలంగాణకు వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మార్పు గాలి వీస్తోందని.. మార్పు తథ్యమని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.