Twitter Users : ప్రపంచ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్… టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లింది. దాన్ని కొనుగోలు చేసిన వెంటనే మస్క్ దూకుడు పెంచారు. కొందరు టాప్ ఎంప్లాయిస్ ని ఇంటికి పంపించేశారు. మరికొందరి లిస్ట్ రెడీ చేశారు. బోర్డు డైరెక్టర్లను కూడా సాగనంపారు. ట్విట్టర్ ని సమూలంగా ప్రక్షాళన చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్ వాడకాన్ని అందరికీ ఎందుకు ఫ్రీగా ఇవ్వాలనేది ఎలన్ మస్క్ ఫిలాసఫీ. అందుకే అకౌండ్ వెరిఫైడ్ బ్లూ టిక్ కావాలంటే నెలకు 20 డాలర్లు యూజర్ చెల్లించేలా బిజినెస్ ప్లాన్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. అంటే మన కరెన్సీలో నెలకు 1600 రూపాయలు అన్నమాట. అమెరికాలో ప్రస్తుతం యూజర్ ఫీజు నెలకు 5 డాలర్లుగా ఉంది. లిమిటెడ్ క్యారెక్టర్స్ తో ఉన్న సందేశాన్ని మరింత పెంచాలనేది మస్క్ యోచనగా కనిపిస్తోంది.
బ్లూటిక్ కోసం ఇదివరకు డబ్బులు కట్టాల్సిన పనిలేదు. డబ్బుల వ్యవహారం కదా అందుకే చాలామంది ట్విట్టర్ కు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని మన దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్విట్టరాటీలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మా యాప్ కు రండి ఉచితంగా సేవలు పొందండి అని ఆహ్వానం పలుకుతోంది. ఈ విషయాన్ని ‘కూ’ యాప్ సంస్థ కో-ఫౌండర్ కం సీఈవో అప్రమేయ రాధాకృష్ణ #SwitchtoKoo యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. మరి ఎంతమంది యూజర్లు ఈ ఆఫర్ ని ఉపయోగించుకుని ‘కూ’ యాప్ వైపు మళ్లుతారనేది చూడాలి.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆత్మ నిర్బర్ భారత్ పిలుపు మేరకు 2020లో ‘కూ’ యాప్ అందుబాటులోకి వచ్చింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో ట్విట్టర్ కు ఇది ప్రత్యామ్నాయం కాబోతుందా అనే చర్చ నడుస్తోంది.