Lokesh Yuvagalam: స్కిల్ డెవలప్ మెంట్ లో.. చంద్రబాబు స్కామ్ చేశారని ఆరోపించి.. ఆయన్ను జైలుకు పంపిన పెద్ద ఒక్క ఆధారాన్నైనా చూపించారా ? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రను పునః ప్రారంభించిన లోకేశ్.. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని విమర్శించారు. తనపై కూడా కేసులు పెట్టిన సీఐడీ అధికారులు.. అందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారన్నారు. తాము ఏ తప్పూ చేయలేదు కాబట్టే.. మళ్లీ యువగళం పాదయాత్రతో ప్రజల ముందుకి వచ్చినట్లు పేర్కొన్నారు.
స్కిల్ కేసులో బాబును అరెస్ట్ చేసిన వారు.. ఒక్క ఆధారాన్నైనా చూపించారా ? టీడీపీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా ? అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. వెనక్కి తగ్గబోమని లోకేశ్ స్పష్టం చేశారు. మీ కౌంట్ డౌన్ మొదలైందని మంత్రులను హెచ్చరించారు. వైసీపీ చేసినట్టే.. తాము కూడా చేస్తే వైసీపీ నేతలంతా జైల్లోనే ఉంటారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా మొత్తం చెల్లించే బాధ్యత తనదేనని లోకేశ్ తెలిపారు. చంద్రబాబును జైలుకు పంపితే పాదయాత్ర ఆగిపోతుందని వైసీపీ నేతలు భావించారని, కానీ.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం ఆగదన్నారు. వైసీపీ బస్సు యాత్ర ఒక తుస్సుయాత్రగా మారిందని, రావాలి జగన్.. కావాలి జగన్ నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ అని ప్రజలు అంటున్నారని గుర్తుచేశారు.