Priyanka Gandhi : భువనగిరి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రజలకు ఏం కావాలో బీఆర్ఎస్ కు తెలియదన్నారు. వచ్చే ఐదేళ్లు ఎలాంటి పాలన కావాలో నిర్ణయించుకునే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేయలేదున్నారు. రైతులకు రుణాలు అందడం లేదని తెలిపారు. ప్రజలకు సాయం చేయాలన్న ఆలోచన బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. నిరుద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఉద్యోగులు రాలేదు. ఉపాధిలేదన్నారు. ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్రపోతోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. భువనగిరి ప్రాంతంలోని ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. భువనగిరి నియోయోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గులాబీ పార్టీ నేతలు విలాసవంతమైన భువంతుల్లో నివసిస్తున్నారని ప్రియాంక అన్నారు. బీఆర్ఎస్ నేతలు ధనవంతులయ్యారని తెలిపారు. పేదలు మరింత పేదరికంలోకి వెళ్లారన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దళితుల, ఆదివాసీల హక్కులను హరిస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడుందన్నారు. రాజస్థాన్, చత్తీస్ గఢ్ మాదిరిగానే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రియాంక వివరించారు. రైతు భరోసా ద్వారా రూ. 15 వేలు, మహిళలకు నెలనెలా రూ.2500, ఫించన్లు రూ. 4వేలు ఇస్తామన్నారు. దళితుల కోసం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
లంబాడీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోనియా గాంధీ ప్రజల పక్షాన ఉన్నారన్నారు. తెలంగాణ బిడ్డలు బాగుండాలని కోరుకున్నారని అందుకే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల తీరుపై ప్రియాంక విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ అన్నదమ్మలు గా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు చిన్నతమ్ముడిగా ఎంఐఎం పార్టీ ఉందన్నారు. ఈ మూడు పార్టీలు ఒకటేనని స్పష్టం చేశారు.
.
.
.