Country Chicken : కష్టపడి చదివి, మంచి జాబ్ కొట్టి, లైఫ్లో సెటిలవ్వాలనేదే నేటి యూత్ ఆకాంక్ష. అయితే.. ఐఐటీలో చదివి, ఏడాదికి రూ.28 లక్షల జాబ్ను నచ్చిన వ్యాపారం కోసం వదిలి.. సక్సెస్ సాధించాడు హైదరాబాద్కి చెందిన సాయికేష్ గౌడ్. ఇంతకీ అతని వ్యాపారం ఏమిటి? ఈ బిజినెస్ జర్నీ ఎలా సాగిందో మనమూ తెలుసుకుందాం.
సాయికేష్ ఐఐటీ వారణాసిలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ఏడాదికి రూ.28 లక్షల వేతనంతో కూడిన జాబ్ వచ్చింది కానీ.. అది అతనికి సంతృప్తినివ్వలేదు. సొంతంగా వ్యాపారం పెట్టి మరో పది మందికి ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి గుడ్బై చెప్పారు.
సాయికేష్ ఉత్సాహం, క్లారిటీని చూసి హేమాంబర్ రెడ్డి, మొహమ్మద్ సమీఉద్దీన్ వ్యాపారంలో పార్టనర్లుగా ముందుకొచ్చారు. వీరిలో హేమాంబర్ రెడ్డికి పౌల్ట్రీ పరిశ్రమలో, మొహమ్మద్కు మాంసం వ్యాపారంలో అనుభవం ఉండటంతో ‘కంట్రీ చికెన్ కో’ పేరుతో కొత్త వ్యాపారం మొదలైంది.
మేలుజాతి నాటు కోడి పిల్లలను కొని, పోషకాహారం ఇచ్చి, పెంచి, వాటి మాంసాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో సిద్ధంచేసి, నీట్గా ప్యాక్ చేసి కస్టమర్లకు అందించటమే కంట్రీ చికెన్ కో ప్రత్యేకత.
అలాగే.. కోళ్లను గ్రామాల్లోని పెరళ్లలో, ఫ్రీ రేంజ్ ఫారమ్లలో పెంచటం, స్టెరాయిడ్, యాంటీ బయాటిక్ వాడకపోవటంతో తక్కువ టైంలో వేలాది కస్టమర్ల విశ్వాసాన్ని పొందగలిగారు. గుడ్లు, చికెన్ పికిల్స్, ఇతర చికెన్ ఉత్పత్తులు కూడా అక్కడే అమ్మటంతో కస్ట్మర్ల సంఖ్య మరింత పెరిగింది.
కూకట్పల్లితో మొదలైన ఔట్లెట్ల ప్రస్థానం 12 ఔట్లెట్లకు చేరగా, మరో 8 ఔట్లెట్లు రానున్నాయి. 25 వేల కస్టమర్లు, 150 మంది ఉద్యోగులున్న ఈ సంస్థ 15 వేల మంది పౌల్ట్రీ రైతులతో నెట్వర్క్ను ఏర్పరచి, వారి నుంచి మంచిధరకు నాటు కోడిపిల్లలను కొని పెంచుతున్నారు.
ఈ ఏడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని పొందిన కంట్రీ చికెన్ కో.. రూ.50 కోట్ల టర్నోవర్ దిశగా వెళ్తోంది.
2025 నాటికి 65 ఔట్లెట్లు, 6 నగరాల్లో వ్యాపారం, 900 సూపర్ మార్కెట్లతో నెట్వర్క్తో బాటు రూ.200 కోట్ల వ్యాపారం దిశగా అడుగులు వేస్తోంది.