Telangana Elections : మరో రెండు రోజులే ఎన్నికలకు గడువు ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పార్టీ నేతలు. ఈ మేరకు నగదు, మద్యం ఏరులై పారుతోంది. ఒక్కో ఓటరుకు వేయి నుంచి 5 వేల రూపాయలు పంచి పెడుతున్నట్టు సమాచారం. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలు ఖరీదైనవన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఎల్బీనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభపెడుతూ.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన నియోజకవర్గంలో డబ్బును పంచిపెట్టాడు. గిఫ్ట్ రూపంలో మహిళా ఓటర్లను ప్రలోభపెడుత్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుధీర్ రెడ్డి సతీమణి మహిళ ఓటర్లకు పర్సులను గిప్ట్ గా ఇస్తున్నారు. అందులో నగదు రూపంలో రెండు వేల రూపాయాలను ఇస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి చర్యలకు పాటు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఖైరతాబాద్లోనూ ఇదే తీరు. అక్కడి బీజేపీ నేత ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ అడ్డంగా దొరికాడు. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి తరుపున అమర్నాథ్ అనే వ్యక్తి డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. తర్వాత అమర్నాథ్ను నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఎన్నికల అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంత కట్టడి చేసినా నగదు ప్రవాహం ఎక్కడా ఆగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఓటుకు నోటే కాదు.. ముక్క, చుక్కతో కూడా ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్లు దావత్లు నడిచినట్టు సమాచారం. ఇదే కాదు.. ఇతర వస్తువుల పంపిణీతో ఓటర్లకు గాలెం వేస్తున్నారు నేతలు. మరోపక్క అధికారుల పర్యవేక్షణ కరువైంది కాబట్టే నోట్ల కట్టలు చేతులు మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.