Jeevan Reddy : ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామంటూ జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారు. అలాగే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని బాండ్ ద్వారా హామీ ఇచ్చారు. ప్రజలకు విశ్వాసపాత్రునిగా ఉంటానని ప్రమాణ పత్రంతో దేవాలయంలో పూజలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రశ్న పత్రాలను అమ్ముకున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. అన్ని అర్హతలున్నా జగిత్యాలను జిల్లా కేంద్రంగా చేయలేదని జీవన్ రెడ్డి ఆవేదన తెలియ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తామని అభ్యర్థి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో జీవన్రెడ్డి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ రాష్ట్రమంతా ఎందుకు తిరుగుతున్నారు? వంద సభల్లో పాల్గొంటున్నా అని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఓటమి ఖరారవడంతోనే కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. జగిత్యాలను జిల్లా కేంద్రం చేశానంటూ సీఎం కేసీఆర్ చెప్పడాన్ని జీవన్రెడ్డి తీవ్రంగా ఖండించారు . జిల్లా అవడానికి అన్ని అర్హతలు జగిత్యాలకు ఉన్నాయన్నారు. కరీంనగర్ కంటే ముందే చాలా ప్రభుత్వ కార్యాలయాలు జగిత్యాలలో ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు.