దాదాపు 15 రోజులు.. 41 మంది కార్మికులు.. అయిన వాళ్లకు దూరంగా ఆ చీకటి గుహలో చిక్కుకుపోయారు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేక బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణం ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని భీతిల్లిపోతున్నారు. అసలు ప్రాణాలతో బయటపడతామో లేదో అని చస్తూ బతుకుతున్నారు. ఇది ఉత్తరఖండ్ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల గాథ. సహాయక చర్యలకు అడుగడుగునా అడ్డంకులు సవాల్ విసురుతున్నాయి. కార్మికులను రక్షించేందుకు ఆధునిక యంత్రాలతో నిపుణులు రోజుకో కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఇదిగో, అదిగో అంటూనే ఇప్పటికే పక్షం రోజులు కావొస్తున్నా.. వారు బయటకు రాలేదు. తమ వారెప్పుడు వస్తారో అని కుటుంబసభ్యులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను రక్షించడానికి ఒకేసారి 2 రకాల పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. మొదట కొండ పైనుంచి నిలువుగా డ్రిల్లింగ్ చేయడం. భారత సైన్యంలో ఇంజినీర్స్ కోర్కు చెందిన మద్రాస్ సాపర్స్ సహకారంతో దాన్ని చేపట్టారు. కొండలో దిగువకు వెళ్తున్నకొద్దీ ఏయే పొరల్లో కూర్పు ఎలాఉందో తెలుసుకునే పరీక్షలు ముందుగా మొదలుపెట్టారు. రెండవది.. విరిగిపోయిన డ్రిల్లింగ్ యంత్ర భాగాలను పూర్తిగా తొలగించడం. గ్యాస్కట్టర్లకు అదనంగా.. హైదరాబాద్ నుంచి రప్పించిన ప్లాస్మా కట్టర్ను ఈ పనికోసం వాడుతున్నారు. 180 మీటర్ల మేర ప్రత్యామ్నాయ సొరంగాన్ని తవ్వే పనిని రేపు ప్రారంభించనున్నారు. అది 12-14 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. బార్కోట్ వైపు నుంచి కూలీలను చేరుకోవడానికి 483 మీటర్లు తవ్వాలని.. ఇది 40 రోజులు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 10 మీటర్లు పూర్తయిందని తెలిపారు. దీపావళి అమావాస్య నాడు సిల్క్యారా సొరంగం మధ్యలో 41 మంది కూలీలు చిక్కుకుపోయి సరిగ్గా రెండు వారాలు పూర్తయింది. మధ్యలో కెమెరాల ద్వారా కూలీలంతా సేఫ్ గానే ఉన్నారని తెలుసుకున్నారు కానీ.. వారంతా వెలుగుని చూసి.. ఆవేదన, అసహనంతో కూలీల కుటుంబాలు ఎదురు చూస్తున్నారు.
కొండ పైభాగం నుంచి డ్రిల్లింగ్ చేసే పని మొదటిరోజే 19.5 మీటర్ల మేర పూర్తయిందని ఎన్డీఎంయే సభ్యుడు సయ్యద్ హుస్సేన్ తెలిపారు. ఇలా 86 మీటర్లు తవ్విన తర్వాత సొరంగం పై కప్పును ఛేదించాల్సి ఉంటుందని, అప్పుడే కూలీలను బయటకు తీసుకురాగలమని చెప్పారు. ఇదే వేగంతో పని సజావుగా జరిగితే గురువారం నాటికే అంతా పూర్తవుతుందని జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ మహమూద్ అహ్మద్ చెబుతున్నారు.