రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. రైతుబంధుకు నాలుగు రోజుల క్రితమే ఈసీ అనుమతిచ్చింది. అయితే పాలకుర్తి సభలో మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యల వల్లే ఈసీ తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతుందని హరీశ్ రావు చెప్పాడు. ఉదయం చాయ్ తాగేలోపు టింగ్ టింగ్ మంటూ ఫోన్లు మోగుతాయన్నారు.
ఈ నెల 28 లోపు రైతు బంధును పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కానీ.. శని, ఆది, సోమ వారాలు బ్యాంకులకు సెలవులు కావడంతో రైతుల ఖాతాల్లో పంటపెట్టుబడి సాయం కింద నగదు జమ చేసే అవకాశం లేకపోయింది. 28వ తేదీ ఒక్కరోజే సమయం ఉండటంతో.. కొంతమంది రైతుల ఖాతాల్లోనైనా డబ్బులు జమ చేయాలని భావించారు. ఇంతలోనే మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో ఈసీ బీఆర్ఎస్ కు షాకిచ్చింది.
ప్రతిఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కోసీజన్ కు ఎకరానికి రూ.5 వేలు చొప్పున రెండు సీజన్ లకు మొత్తం రూ.10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. వానాకాలంతో పాటు యాసంగి సీజన్ రావడానికి ముందు నిధులను విడుదల చేస్తుంది. ఈసారి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో యాసంగి సీజన్ నిధుల విడుదల జమకాలేదు. ఈ పథకానికి కోడ్ వర్తించదని, ఎప్పటినుంచో అమల్లోకి వస్తున్న పథకమని ఈసీకి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాయగా.. రైతుబంధు నిధుల విడుదలకు అనుమతిచ్చింది. ఇంతలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న ఈసీ.. రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. దాంతో. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం నిలిచిపోయింది.
.
.
.