ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్తో నిలిచిపోయిన యువగళం పాదయాత్ర తిరిగి నేటి నుంచి పునః ప్రారంభంకానుంది. సోమవారం రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి నారా లోకేష్ యాత్రను ప్రారంభించనున్నారు . గతంలో ఎక్కడ నుంచి పాదయాత్రను నిలిపివేశారో.. అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేయడంతో దాదాపు 3 నెలల క్రితం లోకేష్ యువగళం పాదయాత్ర అర్థాతరంగా నిలిచిపోయింది. అయితే.. ఈ యాత్ర ఇచ్చాపురం వరకు సాగాల్సి ఉండగా.. మధ్యలో గ్యాప్ వల్ల విశాఖలోనే ముగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు తన పాదయాత్రను విశాఖలోనే ముగించడంతో.. అదే సెంటిమెంట్తో లోకేష్ కూడా అక్కడే ముగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ యాత్ర డిసెంబర్ చివరాఖరు వరకు కొసాగనుంది. పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుండటంతో తెలుగు తమ్ముళ్లు జోష్లో ఉన్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర కోసం ఇప్పటికే లోకేష్ రాజోలు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట భారీగా టీడీపీ శ్రేణులు తరలిరానున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ.. జగన్ వైఫల్యాలను ఎండగడుతూ సాగనుంది.
రోజుకు 15 కిలో మీటర్ల నుంచి 20 కిలో మీటర్ల మేర పాదయాత్ర, మధ్యలో బహిరంగ సభలు, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తూ లోకేష్ ముందుకు సాగనున్నారు. కాగా.. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్రను మొదలుపెట్టారు. 208 రోజులపాటు యాత్ర సజావుగా సాగింది. యాత్రలో భాగంగా సెప్టెంబర్ 8న రాజోలులోకి అడుగుపెట్టిన ఆయన.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పొదలాడలో యాత్రను నిలిపివేశారు. తన తండ్రిని జైలు నుంచి బయటకు రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు తర్వాత.. ఎట్టకేలకు ఇటీవల చంద్రబాబుకు బెయిల్ లభించింది. దీంతో లోకేస్ తిరిగి ప్రజా క్షేత్రంలో నేటి నుంచి అడుగుపెట్టనున్నారు.