తెలంగాణ ఎన్నికల సమరంలో కేసీఆర్ను గద్దె దించడమే టార్గెట్గా.. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ వైఫల్యాలే అస్త్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు పార్టీ నేతలు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. ధరణితో వేల ఎకరాలు స్వాహా చేశారని ఆరోపిస్తోంది కాంగ్రెస్. తాము అధికారంలోకి వస్తే తిన్నదంతా కక్కిస్తామని వార్నింగ్ ఇస్తోంది.
ఎన్నికల కురుక్షేత్రంలో ప్రధాన ఘట్టమైన ప్రచార పర్వం రేపటితో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. వరుసగా క్యూకట్టి మరీ నియోజకవర్గాల ఎన్నిక ప్రచారంలో జోరు పెంచాయి. ఈ మేరకు రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. విజయభేరీ సభలతో కేసీఆర్ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వస్తే తాము రాష్ట్ర ప్రజలకు ఏం చెస్తామో చెబుతూనే.. కేసీఆర్ అవినీతిని ప్రజల్లో ఎండగడుతున్నారు.
ఇక ఇటీవలే మేడిగడ్డ కుంగుబాటు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారడంతో.. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది కాబట్టి నాణ్యత లోపించిందని మండిపడుతున్నారు రాహుల్, రేవంత్రెడ్డిలు. అలాగే ధరణి ముసుగులో భూకుంభకోణం జరిగిందని.. హైదరాబాద్ చుట్టూ భూములను కేసీఆర్ కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు టీపీసీసీ చీఫ్. తాము అధికారంలోకి రాగానే గులాబీ నేతల అవినీతిని బట్టబయలు చేసి.. తిన్నదంతా కక్కిస్తామని.. చర్లపల్లి జైలులో కేసీఆర్కు డబుల్ బెడ్ రూం కట్టిస్తామని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రేవంత్. ఇక ఇదే తీరుగా రాహుల్ గాంధీ కూడా కేసీఆర్ అవినీతి సొమ్మంతా వసూలు చేసి ప్రజలకు పంచుతానని విమర్శలు గుప్పిస్తున్నారు.