తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు . కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చావు నోట్లో తల పెట్టాను అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖమ్మం ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని జ్యూస్ తాగిన తర్వాత.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆగ్రహిస్తే మాట మార్చిన విషయం కేసీఆర్ మర్చిపోతే ఎలా అని విమర్శించారు.
కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. కొత్తగూడెం లో వనమా కుమారుడి అరాచకాలు చూసి కూడా బీఆర్ఎస్ ను వెనుకేసుకు రావటం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.
పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించిన విషయం తెలిసిందే. కొత్తగూడెంలో త్రిముఖ పోరు నడుస్తోంది. సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వర రావు, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీఆర్ఎస్ రెబెల్ జలగం వెంకట్ రావు బరిలో ఉన్నారు.