తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతో మంది యువకులు తమ రక్తాన్ని ధారబోసారు, ప్రాణాలు త్యాగం చేశారు. అలాంటి యువకుల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఏ ఒక్కరి వల్లో కాదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
“నేను ఒకటే మాట చెబుతున్నాను.. బీఆర్ఎస్- బీజేపీ కలిసిపోయాయని చెప్పడానికి ఏకైక నిదర్శనం నేనే. ఎందుకంటే నాపై ప్రధాని మోదీ ఇప్పటివరకు 24 కేసులు పెట్టారు. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను నాపైకి వదిలారు. అవి నిత్యం నాపై దాడి చేస్తూనే ఉన్నాయి.
నా ఇల్లు లాక్కున్నారు, కేసులు పెట్టి పార్లమెంట్ నుంచి వెళ్లగొట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. కొత్త కేసు ఒకటి నాపై పెడతారు. పోనీ మోదీ తను నిద్రపోయే సమయంలోనైనా నన్ను వదిలేస్తాడని అనుకుంటే.. తను కనే కలలో కూడా నన్ను వెంబడిస్తూనే ఉంటాడు.
మరి అన్ని కేసులు నాపై ఉన్నాయి. కానీ కేసీఆర్ మీద ఒక్కటి కూడా లేదు. అంటే దానర్థం వారిద్దరూ ఒకటేనని మీకు అర్థమవుతోందా? వీరికి ఎంఐఎం కూడా తోడైంది, వీరేం చెబితే అది తానా తందాన అంటుంది” అని రాహుల్ గాంధీ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ కారు పంక్చర్ అయ్యిందని, నాలుగు టైర్లలో గాలి పోయిందని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. ఇలా అధికారంలోకి రాగానే మొదటి ఫైల్ మీదే ఆరు ఉచిత పథకాలపై సంతకం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కన్న స్వప్నాన్ని కాంగ్రెస్ అధికరంలోకి రాగానే నెరవేరుస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తిన్న డబ్బులని కక్కిస్తామని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అవకతవకలన్నీ సరిదిద్దుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓకే ఒక్క కుటుంబం ప్రజల సంపదను దోచుకుందని, అవెలా రప్పించాలో మాకు తెలుసునని అన్నారు.