cashew : జీడిపప్పును ఇష్టపడనివారు ఎవరు? కాష్యూ ఓ రకంగా పోషకాల గని. ఆరోగ్యకర కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్-ఇ, విటమిన్-బి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి మినరల్స్ వీటిలో పుష్కలం. కెలోరీలు కాస్త ఎక్కువైనా.. పోషక విలువల కారణంగా కడుపు నిండిన సంతృప్తి కలుగుతుంది. దీంతో మితాహారానికే మొగ్గు చూపుతాం.
ఫలితంగా కెలోరీల ఇన్టేక్ తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును జీడిపప్పు తగ్గిస్తుంది. జీర్ణక్రియనూ మెరుగుపరుస్తుంది. ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి రోజూ గుప్పెడు జీడిపప్పు తీసుకోవాలని అంటారు. దీని సంగతి సరే. ధర మాటేమిటి అని అడగొచ్చు. నిజమే కాజు కిలో ఇప్పుడు రూ.400 నుంచి రూ.1100 వరకు ధర పలుకుతోంది. ఈ కారణంగానే కాజును కొనేందుకు మనం కొంత వెనకా ముందూ ఆలోచిస్తాం.
అయితే దేశంలో ఒకే ఒక్క చోట మాత్రం అత్యంత చౌకగానే కాజు లభిస్తుందని తెలుసా? జార్ఖండ్ జాంతాడా జిల్లాలో జీడి సాగు అధికం. జాంతాడా సిటీ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలా గ్రామం జీడిపప్పుకు ప్రసిద్ధి. రోడ్డు పక్కన రాశులుగా పోసి అమ్మేస్తుంటారు. అక్కడ కాష్యూ కిలో 20-80 రూపాయలకే దొరుకుతుంది. అంటే మనం నిత్యం కొనే కూరగాయల ధరలతో దాదాపు సమానం. ఈ గ్రామంలో 50 ఎకరాల్లో జీడి పంట సాగు చేస్తున్నారు.
ఇక్కడ నేల, వాతావరణం కాజు సాగుకు ఎంతో అనుకూలం. ఈ విషయం తెలుసుకున్న అప్పటి జాంతాడా డిప్యూటీ కమిషనర్ క్రిపానంద్ ఝా జీడి సాగును ప్రోత్సహించారు. ఈ ప్రాంతం అంతగా అభివృద్ధి చెందలేదు. ఈ నేపథ్యంలో రైతులే నేరుగా జీడిపప్పును చౌకధరలకే విక్రయిస్తుంటారు. తమ ప్రాంతంలో కాష్యూ ప్రాసెసింగ్ ప్లాంట్ను నెలకొల్పాలని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు కోరుతున్నారు.