తన కొడుక్కి భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. సమయం వచ్చినప్పుడల్లా తన కొడుకు చుట్టూ ప్రచారం జరిగేలా చూస్తున్నారు. తాజాగా మరోసారి హాట్ టాపిక్గా మారారు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి. ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికేందుకు తిరుపతిలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఏకంగా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేసి ప్రధానికి ఆహ్వానం పలుకుతున్నారు. తిరుపతి ఫ్లైఓవర్ మీద పెద్ద హోర్డింగ్లతో పాటు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే అవి రాష్ట ప్రభుత్వం, నగరపాలక సంస్థ, బీజేపీ నాయకులు వేసిన ఫ్లెక్సీలు కాదు. తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్రెడ్డి పేరు మీద ఆ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఉన్నాయి. అక్కడ ఫ్లెక్సీలలో సీఎం, పీఎం పోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతేకాని ఎక్కడా స్థానిక నాయకుల ఫోటోలు లేవు. మొత్తం మీద హడావుడి అంతా అభినయ్దే కనిపిస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి తిరుమలలో బసచేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు, సీఎం జగన్ స్వాగతం పలుకనున్నారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పీఎం మోడీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లనున్నారు. దీంతో ఆ దారిలో ఫ్లైఓవర్ మీదుగా భారీ హోర్డింగులు వెలిశాయి. ఎక్కడ చూసినా ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ అడుగడుగునా కనిపిస్తున్నాయి. వాటిని అభినయ్రెడ్డి పేరు మీద ఏర్పాటు చేశారు. మరోవైపు స్థానిక బీజేపీ నాయకులు తమ నాయకునికి ఘనంగా స్వాగతం పలకడానికి హోర్డింగ్స్ ట్రై చేసారు. కానీ వారికి ఎక్కడా ఖాళీ ప్లేస్ దొరకలేదు. దీంతో బీజేపీ నేతలు వాపోతున్నారు.
యువ నాయకుడి ప్రమోషన్లో భాగంగానే ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అంటున్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడి ప్రమోషన్ వర్క్లో భాగంగానే ఈ విధంగా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సీఎం జగన్ పర్యటనలో కూడా ఇదే విధంగా సింగిల్ నేమ్ ఫ్లెక్సీతో.. అభినయ్ పేరు మీదుగా హోర్డింగులు వెలిశాయి. తాజాగా ఇప్పుడు కూడా అదే విధంగా వేశారంటున్నారు. అయితే స్థానికంగా బీజేపీ నాయకులు టీటీడీ విధానాలపై పోరాటం చేస్తున్నారు. టీటీడీ నిధులను భూమన కరుణాకర్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అయితే బీజేపీ నేతల ఆరోపణలకు చెక్ పెట్టేలా మోడీకి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు భూమన. ప్రధానికి స్వాగతం ద్వారా బీజేపీకి చెక్ పెట్టడంతో పాటు తిరుపతిలో తిరుగులేని నాయకుడిగా ఎదగడానికి చేస్తున్న ప్రయత్నం అంటున్నారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రహదారుల పేరుతో చేస్తున్న హాడావుడితో అందరి నోట్ల భూమన అభినయ్రెడ్డి నానుతున్నారు. దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం మోడీకి స్వాగత హడావుడి అంటున్నారు.