Rahul Gandhi : తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్నంతటినీ కేసీఆర్ కుటుంబమే దోచుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం ఆందోల్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్ చెప్తారా ? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందని.. రాష్ట్రంలో ల్యాండ్, మట్టి, మైన్స్, వైన్స్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉందని ఆరోపణలు చేశారు. ధరణి పోర్టల్ ను తమ గుప్పిట్లో పెట్టుకుని పేదల భూముల్ని గుంజుకున్నారని విమర్శించారు. పోటీ పరీక్షల పేపర్ల లీక్ ల కారణంగా ఎంతోమంది యువత నష్టపోయారని, వారి జీవితాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో 8 వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, రైతులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు.
నవంబర్ 30న తెలంగాణలో దొరల సర్కార్ కు.. ప్రజలకు మధ్యే ప్రధానమైన పోరు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కేసీఆర్, కేటీఆర్ లు.. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, రాష్ట్రం బాగుండాలంటే దొరల తెలంగాణ పోయి.. ప్రజల తెలంగాణ రావాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒక్కటేనని.. అందుకే ఈడీ, సీబీఐ దాడులు బీఆర్ఎస్ నేతలపై జరగవన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలను అమలుచేసి తీరుతామన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి హామీలను అమలు చేసి.. మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్కొక్క పదకాన్ని అమలు చేస్తామన్నారు