సంచలనంగా మారిన విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన అనేక మలుపులు తీసుకుంది. చివరికి పోలీసులు ఈకేసులో ఓ కంక్లూజన్కి వచ్చారు. ఇది ప్రమాదం మాత్రమేనని.. ఇందులో కుట్రకోణం ఏమీ లేదని పోలీసులు తేల్చారు. ఈ కేసులో వాసుపల్లి నాని, అతడి మామ సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 19 సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి హార్బర్కు వచ్చారని పోలీసులు తెలిపారు. బోట్ నెంబర్ 887లో ఇద్దరూ మద్యం తాగి, ఫిష్ ఫ్రై చేసుకుని పార్టీ చేసుకున్నారని చెప్పారు. మద్యం మత్తులో పక్కన ఉన్న 815 నంబర్ బోటుపై సిగరెట్ పీలిక పడేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. పెద్దగా గాలి రావడంతో.. ఆ సిగరెట్ పీలిక చేపల వలకు అంటుకుంది. ఆ తర్వాత మంటలు బోటు ఇంజన్ కు విస్తరించాయన్నారు. అలా మిగిలిన బోట్లకు మంటలు వ్యాపించి కాలిపోయాయని పోలీసులు తెలిపారు. మంటలను గమనించిన తర్వాత అక్కడి నుంచి నిందితులిద్దరూ మెల్లగా జారుకున్నారని విశాఖ సీపీ చెప్పారు.
ఈ కేసు విచారణలో భాగంగా మొత్తం ముగ్గురు నానిలను విచారించినట్టు సీపీ తెలిపారు. ఇందులో భాగంగా యూట్యూబర్ నానిని కూడా ప్రశ్నించామని అన్నారు. కానీ.. ఇంతలోనే యూట్యూబర్ నాని ఫ్యామిలీ లీగల్ ప్రొసీజర్ ఫాలో అయిందని చెప్పారు. చాలా సున్నితమైన, ప్రమాదకరమైన ఈ కేసులో నిందితులెవరో తేలిందని.. కొంతమేర ఇబ్బంది పడినా.. దర్యాప్తును చివరి దశకు తీసుకొచ్చామని చెప్పారు. 50కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించి ఇన్ని రోజులు ఆధారాలు సేకరించామని అన్నారు. మొత్తానికి నిందితుల్ని అరెస్ట్ చేయడంతో ఈ కేసు మిస్టరీ వీడింది.