ఒకప్పుడు ఉభయాంధ్రప్రదేశ్ కలిసున్నప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగులంతా అక్కడే ఇల్లులు కట్టుకొని చక్కగా స్థిరపడ్డారు. అయితే విభజన తర్వాత ఆంధ్రా ఉద్యోగులందరూ తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి పిల్లా జెల్లలతో కలిసి పెట్టేబేడా సర్దుకొని, ఆస్తిపాస్తులు వదులుకొని, ఉన్న ఇల్లు అద్దెకిచ్చుకొని ఉసూరుమంటూ బయలుదేరారు.
కొందరు ఇంకా రాకపోయేసరికి నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, ఏపీ ఉద్యోగులకోసం హైదరాబాద్ నుంచి విజయవాడకి ఒక స్పెషల్ ట్రైన్ వేయించారు. అప్పట్లో కేంద్రంలో ఉన్న బీజేపీతో ఉన్న సఖ్యత కారణంగా అది సాధ్యమైంది. ఇప్పటికి ఆ ట్రైన్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ పేరుతో తిరుగుతూనే ఉంది. అందులో రెండు కంపార్ట్ మెంట్లు కేవలం ఉద్యోగుల కోసమే కేటాయించారు.
అలా మొత్తానికి ఉద్యోగులను అతికష్టమ్మీద అమరావతికి రప్పించారు. కాలక్రమంలో అందరికీ వాస్తవం బోధపడింది. ఇక విధిలేని పరిస్థితుల్లో రాలేక మిగిలిపోయిన వారు అమరావతి చేరుకున్నారు. కొందరు ఉద్యోగులు ఆ చుట్టుపక్కల ఇళ్ల స్థలాలు కొనుక్కున్నారు. అలాగే అపార్ట్ మెంట్లు కూడా అప్పోసప్పో చేసి లేదా బ్యాంకు లోన్లు పెట్టి కొనుక్కున్నారు. పిల్లలని మళ్లీ కొత్తగా వేలాది రూపాయలు ఫీజులు కట్టి స్కూల్స్ లో జాయిన్ చేశారు. బస్సులు ఏర్పాటు చేసి, రొటీన్ లో పడి హమ్మయ్యా…అని ఊపిరి పీల్చుకున్నారు.
చంద్రబాబు ఐదేళ్లు పరిపాలించారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహనరెడ్డి సీఎం అయ్యారు. మొదటి రెండేళ్లు బాగానే జరిగింది. సడన్ గా ఒకరోజు ఏపీకి మూడు రాజధానులు అంటూ ఒక బిల్లు పెట్టారు. దీంతో ఆ వార్త సెన్సేషన్ అయ్యింది. తర్వాత కోర్టు కేసులు, వాదనలు, మేధావుల చర్చలు, రాజకీయ గందరగోళం ఇలా సాగిపోయింది. ఇక చివరకు సీఎం జగన్ చెప్పినట్టు ఎట్టకేలకు పరిపాలన రాజధానిగా పేర్కొంటున్న విశాఖకు వెళ్లడానికి ముహూర్తం నిర్ణయించారు. ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ లో కదలాల్సిందేనని అంటున్నారు.
అంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడు ఉద్యోగుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. కక్కలేక, మింగలేక అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో ఒక రేంజ్ లో స్థిరపడిన వారంతా అక్కడన్నీ వదిలేసి, అమరావతి వచ్చారు.
ఇప్పుడు ఇవన్నీ వదిలి మళ్లీ పొలోమని బయలుదేరాలి. మళ్లీ ఇక్కడ కట్టుకున్న ఇళ్లను వదిలేయాలా? అమ్మేయాలా? ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకంటే మళ్లీ జగన్ ఓడిపోయి, చంద్రబాబు వస్తే, మళ్లీ అక్కడ నుంచి ఇక్కడికి రావల్సిందే కదా.. అందుకే ఈసారి ఎన్నికల వరకు చూద్దామని చాలామంది డిసైడ్ అయ్యారంట.
ఫ్యామిలీలను వదిలి ఒంటరిగా వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరి ఈసారేమైనా విజయవాడ నుంచి విశాఖపట్నానికి అదే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను తిరిగి నడిపిస్తారా? అని కొందరు అమాయకంగా అడుగుతున్నారు.
ఎందుకంటే ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ఉంది. వైసీపీకి ఫేవర్ గా ఉంది. అందువల్ల మార్చినా మార్చుతారేమోనని అంటున్నారు. లేదంటే రెగ్యులర్ గా వెళ్లే రత్నాచల్ ని ఏమైనా మార్పులు చేస్తారేమో అడగండి అని కొందరు నెట్టింట సెటైర్లు వేస్తున్నారు.