మరికొన్ని గంటల్లో బయటికి వచ్చేస్తామనుకున్న 41 మంది కూలీల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆఖరి నిమిషంలో డ్రిల్లర్ మొరాయించడమే కాదు.. పూర్తిగా ధ్వంసమవడంతో డ్రిల్లింగ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దానిని రిపేర్ చేయడం కూడా ఇప్పట్లో కుదిరే పని కాదని నిపుణులు చేతులెత్తేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అంతేకాదు వారంతా వచ్చే నెల 25 వరకూ ఆ సొరంగంలోనే ఉండాల్సి వస్తుందంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు.
ఉత్తరాఖండ్లోని నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగం కూలి రెండు వారాలు పూర్తయినా.. కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. అంత సజావుగా సాగుతుంది.. మరి కొద్ది గంటల్లో బయటకు వచ్చేస్తారని అనుకుంటున్న సమయంలో భారీ ఆశలు పెట్టుకున్న యంత్రాలు మోరాయిస్తున్నాయి. ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కార్మికులు బయటకు ఎప్పుడొస్తారనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
డ్రిల్లింగ్ చేస్తున్న ఆగర్ మెషిన్ శిథిలాల్లో ఇరుక్కుపోయింది. దీని బ్లేడ్లను కత్తిరించేందుకు ప్లాస్మా కట్టర్ అవసరమని చెబుతున్నారు అధికారులు. దీనిని హైదరాబాద్ నుంచి విమాన మార్గంలో తరలించారు. అది ప్రమాద ప్రాంతానికి చేరుకున్నాక ఇక మాన్యువల్ డ్రిల్లింగ్ను ప్రారంభించే అవకాశాలున్నాయి.
ఆస్ట్రేలియాకు చెందిన మైక్రో టన్నెల్ నిపుణుడు అర్నాల్ డిక్స్ సంచలన విషయాలను తెలిపాడు. లోపలి చిక్కుకున్న 41 మంది కార్మికులు క్రిస్మస్ పండుగ నాటికి బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదని.. పర్వతంతో తాము చేస్తున్న పోరాటంలో మరోసారి ఓడిపోయామన్నారు. ఓపికగా వేచి ఉండాలని.. కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడమే తమ లక్ష్యమంటున్నారు నిపుణులు.