T-20 Series : ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు తిరువనంతపురం వేదికగా రెండో టీ20 జరగనుంది. తొలి టీ20 జోరునే రెండో మ్యాచ్లోనూ కొనసాగించి సిరీస్ అధిక్యాన్ని పెంచుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే తిరువనంతపురంకు చేరుకున్న యువ భారత జట్టు ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉంది. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
తొలిమ్యాచ్ లో విఫలమైన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అవేశ్ ఖాన్ కు అవకాశమివ్వాలని టీమిండియా మేనేజ్ మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా తిలక్ వర్మ స్ధానంలో ఆల్రౌండర్ శివమ్ దుబేను తుది జట్టులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అతనికి బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. కాబట్టి అతడి సేవలను ఉపయోగించుకోవాలని కెప్టెన్ సూర్యకుమార్తో పాటు హెడ్ కోచ్ లక్ష్మణ్ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఆస్ట్రేలియా కూడా రెండు మార్పులతో బరిలోకే దిగే అవకాశముంది. ఈ మ్యాచ్ కు ట్రావిడ్ హెడ్ తో పాటు గ్లెన్ మ్యాక్స్ వెల్, ఆడమ్ జంపా తుదిజట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.