Revanth Reddy Exclusive Interview : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో బిగ్ టీవీ ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ, సామాజిక అంశాలపైనా రేవంత్ ను ప్రశ్నలు అడిగారు. ప్రభుత్వ పాలనలో తీసుకురావాల్సిన మార్పుపై చర్చించారు.
రేవంత్ రెడ్డి చెప్పిన అంశాలు..
“నిజాం పాలన, సమైక్యాంధ్ర పాలనలో జరిగిన తప్పిదాలే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగాయి. సంక్షేమ పథకాలే అమలు చేస్తే చాలు అంటే ప్రత్యేక రాష్ట్రం అవసరమే లేదు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛకోసమే రాష్ట్రాన్ని కోరుకున్నారు. స్వేచ్ఛను గుంజుకుంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు.”
“కేసీఆర్.. మోదీ మద్దతు ఉంటుందని అనుకుంటారు. పెట్టుబడిదారులు ఆయన వెంటే ఉన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ ఆయనకు మద్దతు సంస్థలే. చెగువెరా, నెల్సన్ మండేలా గొప్పఉద్యమకారులుగా ఉన్నారు. వారు ఆస్తులు సంపాదించలేదు. తెలంగాణ ఉద్యమకారులు ఎందరో ఉన్నారు. వారు ఆస్తులు సంపాదించుకోలేదు. కానీ ప్రపంచలోనే ఉద్యమకారుల్లో కేసీఆర్ లా ఇంత ధనవంతుడు ఎవరూ కాలేదు.”
“కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కొంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రులను మార్చింది. నేడు బీజేపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో సోనియా కుటుంబానికి ఎంతో బలమైన అనుబంధం ఉంది. సోనియా యూపీఏ ఛైర్ పర్సన్ గా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఏపీలో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ దెబ్బతింది. అలాగే కేంద్రంలోనూ అధికారం కోల్పోయింది. అనారోగ్యంతో ఉన్నా సోనియా గాంధీ తుక్కుగూడ సభకు వచ్చారు. 8 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాలను మోదీ ప్రభుత్వం కూల్చినా.. సోనియా అంత బాధపడలేదు. కానీ తెలంగాణలో పరిస్థితులపై చలించిపోయారు.”
“తెలంగాణ ఉద్యమంలో కోదండరాందే కీలక పాత్ర. తెలంగాణలో పార్టీలు మారే వైరస్ ను కేసీఆర్ అంటించారు. కాంగ్రెస్ తోపాటు కమ్యూనిస్టు, బీఎస్పీ, తెలుగుదేశం, వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కుకున్నారు. ప్రతిపక్షంలో ఉంటే బతకలేమనే భావన ఎమ్మెల్యేల్లో కేసీఆర్ కల్పించారు. రాజకీయమంటే ఎగుట కలిగేలా చేశారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు దాటినివ్వద్దని ప్రజలకు చెబుతున్నాను. ప్రజలు తలచుకుంటే ఇది సాధ్యమవుతుంది. కేసీఆర్ వలకు చిక్కకుండా మేజిక్ ఫిగర్ కంటే చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలవాలని కోరుకుంటున్నాం.”
“నెహ్రూ మోడల్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. దేశానికి బలంగా పునాదులు వేశారు. నెహ్రూ వేసిన పునాదులపై దేశం అభివృద్ధి చెందింది. తెలంగాణ రాగానే అలాంటి పునాదులు పడాల్సింది. కేసీఆర్ అన్నీ తెలిసినా మార్పుకోసం ప్రయత్నం చేయలేదు. తనతోపాటు ఎంతో మందిని జైలుకు పంపారు. మండలి రాజకీయ నేతలకు పునరావాస కేంద్రంగా మారింది.”
“కాంగ్రెస్ లో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. ఉమ్మడి నిర్ణయాలే అమలవుతాయి. మరో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని భావిస్తున్నాను. ప్రజలు స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్నారు. సామాజిక న్యాయం, సమానమై అభివృద్ధి కోరుకుంటున్నారు. 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నా. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతోపాటు ఏడో గ్యారంటీ కూడా ఇస్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తాం.”
ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్న.. బీసీ పాలన చేతకాదు అని అన్నారా?
“బీసీలకు పాలన చేతకాదు అని నేను అనలేదు. దుష్ప్రచారం చేశారు. కాకతీయ సామ్రాజ్యం ఎలా కూలిపోయిందో వివరించిన అంశాన్ని బీసీలకు అంటగట్టారు. రెడ్లు, వెలమ గురించే గతంలో మాట్లాడా. బీసీల గురించి కాదు. “
రామచంద్రమూర్తి ప్రశ్న.. సాగుకు 3 గంటలే కరెంట్ సరిపోతుంది అని అన్నారా?
“కేసీఆర్ గెలుస్తామంటే తాను తనపై ఎందుకు దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు. 3 గంటలే కరెంట్ చాలు అని నేను అనలేదు. నిరూపించమని సవాల్ చేశాను.
అబద్ధాల ప్రచారంతో రెండుసార్లు గెలిచారు. అలాగే మూడోసారి గెలవాలనుకుంటున్నారు.”
కోదండరాం ఏమ్మన్నారంటే..
“ఉద్యమానికి ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామాకాలు. కానీ అస్థిత్వం, ప్రజాస్వామం ఈ రెండు లేకపోతే అర్థంలేదు. నేడు తెలంగాణలో ప్రభుత్వం మాఫియాగా మారింది. కాంగ్రెస్ మార్పు తీసుకొస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ కలిశాం.తెలంగాణలోనే కాదు ఆంధ్రలో కూడా సామాజిక మార్పు జరుగుతుందని చెప్పారు. “
హరగోపాల్ ఏం చెప్పారంటే..
“ప్రజా ఉద్యమం నుంచి నాయకత్వంలో ప్రభుత్వం గుణాత్మకంగా ఉండాలి. కానీ తెలంగాణలో అలా జరగలేదు. ఉద్యమం నుంచి వచ్చిన వారికి ఉద్యమాన్ని ఎలా అణచివేయాలో కూడా తెలుసు. తెలంగాణలో అదే జరుగుతోంది. పౌరహక్కుల ఉద్యమ సమావేశానికి గతంలో కేసీఆర్ వచ్చారు. పౌరహక్కుల పోరాటం చేస్తామన్నారు. కానీ సీఎం అయిన తర్వాత మళ్లీ ఆయనను కలవలేదు. నేడు తెలంగాణలో విషాదంగా ఉంది. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోనిది. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై రైడ్స్ జరుగుతున్నాయి. చట్టబద్ద పాలన రావాలి. కేంద్రం ప్రభుత్వం చెప్పింది జనం వినాలి. కానీ మనం చెప్పేది వారు వినరు. ఇవే పరిస్థితులు దేశంలో ఉన్నాయి. తెలంగాణలో 16 పౌరసంఘాలను నిషేధం విధించారు. నిరసన తర్వాత వాటిపై నిషేధం తొలగించారు. మాలాంటివారిపై నిర్భందాలు విధిస్తున్నారు. పౌరుహక్కుల సంఘాలను కాంగ్రెస్ కాపాడాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కాపాడాలి. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో మాఫియా అభివృద్ధి చెందింది. భూమలను కబ్జా చేస్తున్నారు. హైదరాబాద్ భూములపై కమిషన్ పై వేయాలని కేసీఆర్ ను కోరాను. వ్యవసాయంపైనా కమిటీ వేయమన్నాం”
.
.