Rohin Reddy : హైదరాబాద్ అంబర్ పేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా రోహిన్ రెడ్డి బరిలో ఉన్నారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కే ఓటేద్దామని జనం ఫిక్స్ అయిపోయారని రోహిన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలకు ప్రజలు ఆకర్షితులయ్యారని వివరించారు.
BRS పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని రోహిన్ రెడ్డి అంటున్నారు. ఆ పార్టీ అభివృద్ధిని గాలికొదిలేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ న్యాయం చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. BRS, BJP దోస్తీ గురించి అందరికీ తెలుసన్నారు. తన విజయం చాలా సులభమేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను ప్రజలు చీదరించుకుంటున్నారని రోహిన్ రెడ్డి అన్నారు. తాను గెలిచాక నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా కంటే మేనిఫెస్టోపైనే మొగ్గుచూపుతున్నారని తెలిపారు. BRS వాళ్లే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలవడం 100% పక్కానని తేల్చిచెప్పారు.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలోనే గ్రోత్ ఉందని రోహిన్ రెడ్డి అన్నారు. వాళ్లు తప్ప మరొకరు అభివృద్ధి చెందలేదన్నారు. అవినీతిలో దావూద్ ఇబ్రహీంతో పోటీపడుతున్నారని ఆరోపించారు. అన్ని స్కాముల్లో ఆ కుటుంబమే ఉందన్నారు. కమీషన్ల కోసమే ఫ్లై ఓవర్లు కడుతున్నారని విమర్శించారు.కేసీఆర్ కుటుంబంపై ఎందుకు ఐటీ రైడ్లు చేయడంలేదని రోహిన్ రెడ్డి ప్రశ్నించారు.