Priyanka Gandhi Madhira : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిర నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. మధిర రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను మర్చిపోయాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేళ్లలో వేల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని సెటైర్లు వేసారు.
పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అవినీతి ద్వారా వేల కోట్లు కూడబెట్టిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు పెద్ద భవనాలు, ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని విమర్శించారు. ఇలా బీఆర్ఎస్ నాయకులు ధనికులయ్యారన్నారు. తెలంగాణ ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గుతున్నారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
100 మంది కేసీఆర్ లు వచ్చినా మధిర గేట్ కూడా తాకలేరని భట్టి విక్రమార్క ఛాలెంజ్ చేశారు. తాను 50 వేల మెజార్టీ తో గెలుస్తానని స్పష్టం చేశారు.