PM Modi Kamareddy | కేసీఆర్ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కామారెడ్డిలో శనివారం బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగించారు
PM Modi Kamareddy | కేసీఆర్ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కామారెడ్డిలో శనివారం బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులన్నీ బీజేపీ నాయకులకు ఏటిఎంలా మారిపోయాయని మండిపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ యువతను మోసం చేసిందని విమర్శించారు.
ప్రజాధనాన్ని బీఆర్ఎస్ నాయకుల దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. I.N.D.I.Aగా విపక్ష కూటమి పేరు మార్చుకున్నంత మాత్రాన వారి నైజం మారదని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తోందని అన్నారు. బీజేపీలో బీసీలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని.. బీసీలంతా తమ పార్టీ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని సీఎంను చేస్తామని ప్రకటించామని ఆ మాటను నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ ట్రాక్ రికార్డును ప్రజలు చూస్తే.. బీజేపీ ఏం చెబుతుందో అది చేసి తీరుతుందని అన్నారు. ఉదాహరణగా ఆర్టికల్ 370తో పాటు ట్రిపుల్ తలాక్ రద్దు, చట్టసభల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్, రైతులకు ఒకటిన్నర రెట్లు గిట్టుబాటు ధర, సైనికులకు వన్ ర్యాంక్- వన్ పెన్షన్, రామ మందిర నిర్మాణం తదితర హామీలను నిలబెట్టుకున్నాం గుర్తుచేశారు. తెలంగాణకు చెప్పినట్లు పసుపు బోర్డు ఇచ్చామని చెప్పారు.
తెలంగాణలో బీజేపీ సర్కారు వస్తుందని ఆయన అన్నారు. అవినీతి, కుటంబ పాలనను కామారెడ్డి ప్రజలు తిరస్కరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.