పదేళ్లలో కేసీఆర్ పాలనలో జరిగిన వైఫల్యాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.. మంత్రి కేటీఆర్. TSPSC, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, ధరణి అంశాల్లో చేసిన తప్పులు, జరిగిన పొరపాట్లను ఆయన ఒప్పుకున్నారు. TSPSC పేపర్ల లీక్ అంశంలో విమర్శలు చేసిన విపక్షాలపై గతంలో ఎదురుదాడి చేసిన కేటీఆర్.. TSPSC వ్యవహారంలో పొరపాట్లు నిజమేనని ఇప్పుడు అంగీకరించారు. మనుషులన్నాక పొరపాట్లు జరుగుతాయని, మళ్లీ అధికారంలోకి వస్తే పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రవల్లిక ఆత్మహత్య విషయంలోనూ తన మాటలు తప్పేనని గతంలో ఒప్పుకున్నారు కేటీఆర్. ప్రవల్లిక అసలు TSPSC ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తే చేయలేదని ముందుగా అన్న కేటీఆర్.. ప్రవల్లిక దరఖాస్తులు, హాల్టికెట్ల జిరాక్స్ ప్రతులను బిగ్ టీవీ బయటపెట్టడంతో.. చివరికి తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది.
ధరణి విషయంలో అంతా బాగుందని ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తుండగా.. అందులోనూ చిక్కులు, చికాకులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మంత్రి కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వస్తే ధరణిలో లోపాలు సరిదిద్దేందుకు ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ అంశాల్లోనూ తమ ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకున్న కేటీఆర్.. తగినన్ని నిధులు లేకపోవడం వల్లే నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ చేయలేకపోయామన్నారు.
కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్పై చేసిన ఆరోపణల విషయంలోనూ ఆయన తన తప్పు ఒప్పుకున్నారు. హైదరాబాద్ ఐటీ కంపెనీలను కర్ణాటకకు తరలించేందుకు డీకే శివకుమార్ కుట్ర చేశారని మాట్లాడిన కేటీఆర్.. నిజాలు నిర్ధారించుకోకుండానే ఆరోపణలు చేశానంటూ తప్పు ఒప్పుకున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన పొరపాట్లను కేటీఆర్ ఒక్కొక్కటిగా కేటీఆర్ ఒప్పుకుంటుండటంతో.. బీఆర్ఎస్ శ్రేణులు కలవరపడుతున్నాయి. బీఆర్ఎస్ చేసిన తప్పులు, జరిగిన పొరపాట్లను కేటీఆర్ ప్రస్తావించడం.. ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.