హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు ఎట్టకేలకు విడుదలయ్యారు. ఇరు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో తమ వద్ద బందీలుగా ఉన్న 240 మంది బందీల్లో 24 మందిని హమాస్ విడిచిపెట్టింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 39 మంది పాలస్తీనా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించింది. హమాస్ విడుదల చేసిన బందీలు దేశానికి వచ్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. వారికి ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మొత్తం 50 మంది బందీలను విడుదల చేయనుండగా, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది.
హమాస్ విడిచి పెట్టిన బంధీల్లో 13 మంది 2 నుంచి 85 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళలు, చిన్నారులు ఉన్నారు. 10 మంది థాయ్ జాతీయులు, ఒక ఫిలిప్పీన్స్కు చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ఖతర్ బందీల విడుదలను నిర్ధారించింది. రెడ్క్రాస్ సంస్థ ద్వారా బందీల విడుదల సజావుగా సాగింది. హమాస్ చెర నుంచి బందీలు తిరిగి రావడంతో ఇజ్రాయెల్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
ఇజ్రాయెల్ విడిచినపెట్టిన వారిలో 24 మంది మహిళలు కాగా 15 మంది చిన్నారులు. వారిని తీసుకుని వాహనాలు వెస్ట్ బ్యాంక్లోని జైళ్ల నుంచి రమల్లాకు చేరుకున్నాయి. కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం కావడంతో గాజాకు మానవతా సాయం చేరవేతలోనూ వేగం పెరిగింది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, వైద్య పరికరాలు, దుస్తులు తదితర సామగ్రితో దాదాపు 90 వాహనాలు నిన్న ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ గుండా గాజాలోకి ప్రవేశించాయి. అలాగే లక్షా 30 వేల లీటర్ల డీజిల్ కూడా గాజాకు అందింది.
ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కేవలం నాలుగు రోజులపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒప్పందాన్ని పొడిగిస్తారన్న ప్రచారం ఉంది. హమాస్ చెరలో 240 మంది బందీలు ఉన్నారు. వారందరినీ విడుదల చేయించాలంటే నాలుగు రోజుల సమయం సరిపోదు. అందుకే ఒప్పందం పొడిగింపుకు ఇజ్రాయెల్ మొగ్గు చూపే అవకాశం ఉంది.
తమ లక్ష్యాలను మరిచిపోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మరోసారి ప్రకటించారు. బంధీలను విడుదల చేస్తామని.. హమాస్ను ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే బందీలందరిని హమాస్ విడిచి పెడుతుందా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.