ఇలా ఎవరైనా చేస్తారా? మీరే చెప్పండి. ఆటలో అంపైర్ దే కదా ఫైనల్ డిసిషన్. తను ఒక అవుట్ ఇచ్చాడని చెప్పి మ్యాచ్ ని వాకౌట్ చేయడం ఎక్కడైనా విన్నారా?
ఆ…ఆ…కంగారుపడకండి…ఇది పెద్ద జట్ల మధ్య జరిగింది కాదు…చిన్న జట్ల మధ్యే జరిగింది. అయితే అది ఇంటర్నేషనల్ మ్యాచ్ అనే చెప్పాలి. అది కూడా రెండు దేశాల మధ్య జరిగే ఒక సిరీస్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో సర్వత్రా ఆసక్తి రేగింది.
జనరల్ గా గల్లీ క్రికెట్ లో ఇలాంటివి జరుగుతుంటాయి. అంపైర్ తెలియనితనం లేదా అజ్నానం లేదా కళ్ల జోడు లేకపోవడం లేదా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం ఇలా ఎన్నో ఉంటాయి. దీంతో అక్కడక్కడ గొడవలు అవుతుంటాయి. కొట్టుకుంటుంటారు. ఆడమని చెప్పి మ్యాచ్ మధ్యలో వెళ్లిపోతుంటారు. కానీ రెండు దేశాల మధ్య జరగడంతో నెట్టింట వైరల్ గా మారింది.
నిజానికి దేశాల మధ్య మ్యాచ్ ఆగిపోతే వర్షం వల్ల జరుగుతుంది. లేదా వెలుతురు సరిగా లేదని కూడా మ్యాచ్ ఆపేస్తుంటారు. ఇలా రకరకాల కారణాలతో మ్యాచ్ ఆగిపోతే డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను నిర్ణయిస్తుంటారు.
కానీ ఇలా ఎవరైనా చేస్తారా? మీరే చెప్పండి. ఇలాంటి అరుదైన ఘటన ఇండోనేషియా, కంబోడియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. కంబోడియా, ఇండోనేషియా జట్ల మధ్య ఏడు టీ20ల సిరీస్ నడుస్తోంది. అందులో భాగంగా ఆరో టీ 20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఇండోనేషియా ఫీల్డింగ్ ఎంచుకుంది.. దీంతో కంబోడియా మొదట బ్యాటింగ్ చేసింది.
సరిగ్గా 11.3 ఓవర్ వద్ద కంబోడియా బ్యాటర్ లక్మన్ భట్ క్యాచ్ ని ప్రత్యర్థి జట్టు పట్టింది. అయితే ఈ ఔట్ వివాదాస్పదమైంది. దీంతో కంబోడియా మ్యాచ్ కొనసాగించేందుకు అంగీకరించలేదు. అంపైర్లు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో చేసేది లేక ఇండోనేషియాను విజేతగా ప్రకటించారు.
ఏడు టీ20 సిరీస్లో ఈ విజయంతో ఇండోనేషియా 4-2 ఆధిక్యంలోకి వెళ్లింది. నిజానికి చివరి వరకు నిలిచి కంబోడియా ఆడి గెలిచి ఉంటే 3-3తో సమానంగా ఉండేది. కానీ కోపంతో వెళ్లిపోవడంతో తర్వాత జరిగే ఏడో మ్యాచ్ లో విజయం సాధించినా తేడా 4-3 అవుతుంది. అంటే సిరీస్ నే కోల్పోయినట్లయ్యింది. తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఊరికినే అనలేదని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.