అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. దీంతో రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు బీఆర్ఎస్ వెల్లడించింది. అయితే రైతు బంధు పంపిణీ అనుకున్నంత సులువుగా అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 28 లోగానే ఇదంతా పూర్తిచేయాలని, ఆ తరువాత అంటే 29వ తేదీ, పోలింగ్ రోజు 30న రైతు బంధు పంపిణీకి అనుమతించమని ఆదేశించింది.
దీంతో ఎన్నికలకు ముందు డబ్బును జమ చేయాలంటే ఈ నెల 28లోపు పంపిణీ పూర్తి చేయాల్సి ఉంది. అయితే బ్యాంకులకు 25 నుంచి 27 వరకు.. అంటే వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. దీంతో కేవలం ఒక్క 28వ తేదీన మాత్రమే డబ్బు పంపిణీకి అవకాశం ఉంది. అయితే రైతు బంధు నిధులను ఎప్పుడు విడుదల చేసినా ముందుగా తక్కువ భూ విస్తీర్ణం ఉన్న రైతులకే మొదట పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అదే విధంగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఒక్కరోజులో రైతులందరి ఖాతాల్లో డబ్బును జమ చేయడం అంత సులువు కాదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎకరానికి 5 వేల చొప్పున మొత్తం 65 లక్షల రైతుల ఖాతాల్లో దాదాపు 7 వేల 500 కోట్లను జమ చేయాల్సి ఉంది. ఈ సారి పోడు భూముల రైతులకు కూడా రైతు బంధు అందిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో బీఆర్ఎస్ రైతుబంధు అర్హులందరికీ 28న రాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.