Rajasthan Polling : ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవ్వగా.. ప్రశాంతగా కొనసాగుతోంది. మొత్తం 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. మొత్తం 1862 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఐదారు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగనుండగా.. దానికి ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ రెండూ.. సెమీఫైనల్గా భావిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో గడచిన మూడు దశాబ్దాలుగా ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన దాఖలాల్లేవు. అయితే ఈ సారి ఈ ఆనవాయితీని బద్దలు కొడుతామని చెబుతున్నారు కాంగ్ఎస్ నేతలు.
నిజానికి రాజస్థాన్లో 200 స్థానాలకు జరగాల్సి ఉంది. అయితే శ్రీగంగానగర్ జిల్లా కరణ్పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే గుర్మీత్సింగ్ కునర్ ఆకస్మిక మరణంతో అక్కడి ఎన్నికను వాయిదా వేశారు. మొత్తం 5 కోట్ల 25 లక్షల 38 వేల105 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారే. దీంతో వీరి ఓట్లు ఎవరికి పడతాయన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
రాజస్థాన్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే నువ్వా నేనా అన్న పోరు ఉంది. మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ శాయశక్తులు ఒడ్డింది. ఈసారి అయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, కార్యక్రమాలతో పాటు ఏడు ఉచిత హామీలు తమకు మళ్లీ అధికారం కట్టబెడ్తాయని కాంగ్రెస్ భావిస్తుంది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాగైన అధికారంలోకి రావడం కోసం తీవ్రంగా శ్రమించింది. మరి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.కాగా.. కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ జైపూర్ లోని సివిల్ లైన్స్ ఏరియా పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.