మొన్న కర్ణాటక ఎన్నికలు.. నేడు తెలంగాణ ఎలక్షన్స్.. కాంగ్రెస్ జోరుకు బ్రేకు వేసేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ను నేరుగా ఢీ కొట్టగా తెలంగాణలో రహస్య మిత్రుడు కేసీఆర్కు మేలు జరిగేలా తెరవెనుక కథ నడిపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఎత్తుగడలే కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు కూడా విమర్శలకు తావిచ్చేలా చేస్తోంది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన వివేక్ వెంకటస్వామి సంస్థలపై ఐటీ రైడ్స్ జరిగాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీలో ఉన్నప్పుడు జరగని సోదాలు.. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని వివేక్ ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను అర్ధం చేసుకోవాలని కోరుతూ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రజలకు బహిరంగా లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ విపక్షాలపై దాడులు జరుగుతున్నాయి. సీబీఐ, ఈడీ, ఐటీ రైడ్స్ పరిపాటిగా మారుతున్నాయి. ఇదే విషయంపై ఇటీవల విపక్ష అఖిలపక్షం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీరు ఆరోపణలకు తావిచ్చేలా చేస్తోంది. బీజేపీ నాయకులుగానీ.. వాళ్లకు అనుబంధంగా ఉంటున్న నేతల జోలికి గానీ.. కేంద్ర సంస్థలు వెల్లకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తెలంగాణలోనూ బీఆర్ఎస్ నేతలను టచ్ చేయకుండా కాంగ్రెస్ నేతల ఇళ్లు, వ్యాపార సంస్థల్లో సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ఇటీవల కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, వివేక్ వెంకటస్వామిని కేంద్ర సంస్థలు టార్గెట్ చేశాయి. ఈ పరిణామాలపై హస్తం నేతలు భగ్గుమంటున్నారు. వాళ్లతో ఉంటే సచ్చీలురు లేదంటే ఐటీ, ఈడీ పేరుతో బెదిరింపులకు దిగుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేకే తనపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడుతున్నారు.
విశాక ఇండస్ట్రీస్తో వివేక్ వెంకటస్వామి కుటుంబానికి మంచి పేరు ఉంది. ఇప్పటి వరకు వెయ్యికోట్ల పన్నులు కట్టామని వివేక్ స్వయంగా వెల్లడించారు. అలాంటి సంస్థపై ఐటీ రైడ్స్ జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్, కేటీఆర్ ఫిర్యాదు చేయడం వల్లే ఐటీ దాడులు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన కేసీఆర్పై ఐటీ దాడులు జరిపే దమ్ము ఎందుకు లేదని కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అభ్యర్థి వివేక్ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తన మీద కుట్ర చేశాయని, తనపై ఎన్ని దాడులు చేసినా ఏం చేయలేరని సవాల్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తన ఇంట్లో ఐటీ దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు కోటి రూపాయల అప్పు ఇచ్చినట్లు అఫిడవిట్లోనే పేర్కొన్నానని అలాంటప్పుడు వాటిపై ఎందుకు స్పందించరని వివేక్ ఐటీ అధికారులు, కేంద్రాన్ని నిలదీశారు.
ఐటీతో పాటు కేంద్ర సంస్థల తీరుపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు ఇప్పడే కనిస్తున్నాయా? అని నిలదీశారు. పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పతనం ఆరంభమందని రేవంత్ హెచ్చరించారు. క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలను రాజకీయ క్రీడలో పావులుగా వాడుతున్నారని ఫైరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీలలో చేరిన వారు పవిత్రులా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండటంతోనే దాడుల కుట్రకు తెరలేపారని రేవంత్రెడ్డి ప్రజలకు రాసిన లేఖలో ప్రస్తావించారు. కేసీఆర్కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి కేంద్ర సంస్థలు వెళ్లడం లేదని.. కాళేశ్వరం అవినీతి బయటపడినా ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో తమకు ప్రమేయం లేదని కిషన్రెడ్డి చెబుతున్నారు. దాడులతో బీజేపీకి సంబంధం లేదని అంటున్నారు. అధికారులకు ఉన్న సమాచారం మేరకే సోదాలు చేస్తారని తమను తప్పుపడితే ఎలా అని అమాయకంగా చెబుతున్నారు కేంద్ర మంత్రి. అయితే కాళేశ్వరం సహా తెలంగాణలో అవినీతి జరిగిందని ప్రధాని, కేంద్రహోమంత్రి ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్తావిస్తున్నారు. మరి అత్యున్నత పదవిలో ఉన్న మోడీ, అమిత్ షా ప్రకటనల ఆధారంగా కేంద్ర సంస్థలు రంగంలోకి దిగి దాడులు ఎందుకు చేయవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలో ఉన్నవాళ్లే సచ్చీలురా ? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేస్తూనే బీజేపీ లైట్ తీసుకుంటోంది. అదే కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యాపారవేత్తలైన నేతలను టార్గెట్ చేస్తుండటం దేనికి సంకేతమో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని హస్తం నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి కుట్రలకు ఓటుతోనే బదులు చెప్పాలని కోరుతున్నారు.