Uttarakhand Tunnel Rescue : ఉత్తరాఖండ్ టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఇంకా బయటకు రాలేదు. ఇదిగో ఈరోజు.. రేపు అంటూ అధికారులు చెబుతున్నా.. డ్రిల్లింగ్ పనులు సాంకేతిక సమస్యలతో నిలిచిపోతుండటం.. కార్మికులు బయటి ప్రపంచంలోకి రావడం మరింత ఆలస్యం అవుతోంది. మరో 12 మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే చాలు వారు మృత్యువును జయించినట్టే.. ఆ చీకటి గుహ నుంచి 41 మంది సురక్షితంగా బయటపడి వెలుగును చూడటమే. ఇలా రెండు రోజుల నుంచి అటు వారి ఆప్తులు.. ఇటు దేశ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే వరుసగా వస్తున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కార్మికుల రెస్క్యూ ఆపరేషన్స్కు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రస్తుతం టన్నెల్లో చిక్కుకపోయిన కార్మికులు 14 రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన డ్రిల్లింగ్ పనులు కాసేపటికే నిలిచిపోయాయి.డ్రిల్లింగ్ మిషన్లో సాంకేతిక సమస్యతో నిలిచిపోయాయి. అయితే మరికొన్ని మీటర్ల దూరంలోనే కార్మికులు ఉన్నారని.. అన్ని అనుకూలిస్తే మరికొన్ని గంటల్లోనే ఆపరేషన్ ముగుస్తుందని చెబుతున్నారు. సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చిన కార్మికులను వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా 41 అంబులెన్సులు అందుబాటులో ఉంచారు.
దీపావళి రోజున మొత్తం 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారని, దీని కారణంగా వారు, వారి కుటుంబాలు, రెస్క్యూలో పాల్గొన్న బృందాలు దీపావళిని జరుపుకోలేదని.. ఈరోజు రెస్క్యూ విజయవంతమైతే దీపావళిని బయట జరుపుకుంటామన్నారు తోటి కార్మికులు. డ్రిల్లింగ్ పూర్తయితే తాడు, స్ట్రెచర్, ఆక్సిజన్ సిలిండర్తో 10 నుంచి 12 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సొరంగం లోపలికి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కార్మికులను పైపు గుండా బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైన ట్రయిల్ రన్ ఎన్డీఆర్ఎఫ్ విజయవంతంగా పూర్తి చేసింది. పైపులైన్ గుండా కొద్ది దూరం వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగి తిరిగి మళ్లీ వెనక్కి వచ్చాడు.