North Korea :మీరు చదివింది నిజమే. ఉత్తర కొరియా ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లంతా గెలుస్తారు. అంతేకాదు.. నూటికి నూరుశాతం పోలింగ్ జరుగుతుంది.
ఉత్తర కొరియాలో కూడా అన్ని దేశాల్లాగానే ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. కానీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రికమెండ్ చేసిన అభ్యర్థి మాత్రమే బరిలో ఉంటారు. అతనికి పోటీగా ఎవరూ నిలబడకూడదు.
మనదేశంలో ఒక్కరే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిస్తే.. ఎన్నిక జరపరు. ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. కానీ.. ఉత్తర కొరియాలో మాత్రం.. ఒకే అభ్యర్థి బరిలో ఉన్నా.. ఎన్నిక జరుపుతారు.
పోలింగ్ రోజు దేశంలోని ఓటర్లు అందరూ ప్రభుత్వానికి విధేయత చూపుతూ.. ఉదయమే పోలింగ్ స్టేషన్ల వద్ద ఏర్పాటుచేసిన క్యూ లైన్లలో నిలబడతారు.
బూత్ లోపలికి వెళ్తే.. బ్యాలెట్ పేపర్ ఇస్తారు. అందులో ఒకే అభ్యర్థి పేరు ఉంటుంది. ఆ పేపర్ తీసుకొని, చూసి బ్యాలెట్ పెట్టెలోకి అందరిముందూ ఓటు వేయాలి.
ఒక వేళ బ్యాలెట్ను పెట్టెలో వేయకపోయినా, ఓటింగుకు రాకపోయినా ఆ రోజు నుండి ఆ వ్యక్తిపై పోలీసుల నిఘా ఉంటుంది.
ఓటు వేసి బయటకు రాగానే.. ప్రతి ఓటరు అప్పటికే ఓటేసి బయట వెయిట్ చేసే ఓటర్లతో కలసి ‘మనం మళ్లీ తెలివైన వారినే ఎన్నుకున్నాం’ అని మీడియా ముందు సందడి చేస్తారు.
అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 100% పోలింగ్ నమోదవుతుంది. ఇక.. ఓట్ల కౌంటింగ్ రోజు ముందుగా.. దేశాధ్యక్షుడు కిమ్ నియోజకవర్గపు ఓట్ల ఫలితాలను ప్రకటిస్తారు.
ప్రతిసారీ.. ఆయన 100% ఓట్లను పొంది బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. తరువాత అన్ని నియోజకవర్గ ఫలితాలు ప్రకటిస్తారు.
ఆ దేశంలో పేరుకు పార్లమెంటు ఉన్నా.. అధ్యక్షుని నిర్ణయాలను యధావిధిగా ఆమోదించటమే దానిపని. ఎప్పుడో ఓసారి పార్లమెంటు సమావేశం జరుగుతుంది.
దేశంలో మరో 3 పార్టీలు ఉన్నప్పటికీ, డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఆ మూడూ కలిసి కిమ్ జోంగ్ ఆధ్వర్యంలో ఉత్తర కొరియా అభివృద్ధికి కృషి చేస్తాయి.