RTC Number Plate : వాహనాల నెంబర్ ప్లేట్లపై రకరకాల అక్షరాల ఉంటాయి. సిరిస్ ప్రకారం రాష్ట్రాలకు సంబంధించిన రవాణాశాఖ ప్రతి వాహనానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ను కేటాయిస్తుంది. అయితే ఏపీ, తెలంగాణలోని బస్సుల నెంబర్ ప్లేట్లపై ‘జడ్’ అనే అక్షరం ఉంటుంది. దీనికి కారణాలు తెలుసుకోవాలంటే ఈ కింది వివరాలు తెలుసుకోవాల్సిందే.
హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం పరిపాలించినప్పుడు, నాటి ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం ‘నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్’ను (NSRRTD) ఏర్పాటు చేసింది.ఈ సంస్ధ 1932 జూన్లో తొలిసారిగా సిటీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. 27 బస్సులతో 166 మంది సిబ్బంది తో ఇది మొదలయింది.ఈ బస్సులను అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి జహ్రాబేగం (ZAHRA BEGUM)పై గౌరవంతో ఆమె పేరిట నమోదు చేయించారు. అంతేకాదు.. ఆ బస్సుల నంబర్ ప్లేట్లలో చివరి అక్షరంగా Zను చేర్చారు.
ఆ కాలంలో సిటీ బస్సులు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచేవి. నేటి ట్యాంక్బండ్ అప్పుడు రెండు నగరాల మధ్య ప్రధాన రహదారిగా ఉండేది.కింగ్కోఠితో పాటు ఉద్యోగులు, అధికారుల నివాస ప్రాంతాలకు ఆ బస్సులను నడిపేవారు.1948 సెప్టెంబరు17 న నిజాం సంస్థానం.. భారత యూనియన్లో విలీనమయింది.
ఆ సమయంలో విలీన నియమాల్లో భాగంగా.. భవిష్యత్తులోనూ ఆర్టీసీ బస్సు నంబర్ల చివర జెడ్ అనే పేరును కొనసాగించాలని నిజాం కోరారు.దీంతో ఆ తర్వాత ఏర్పడిన ఆర్టీసీ ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగించింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినా.. నేటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు దీనిని పాటిస్తూనే ఉన్నాయి.
అయితే.. ఇటీవల కొన్ని APSRTC బస్సుల నెంబర్ ప్లేట్ లలో TA, TB, TC, T, U, V, W, X ఇలా కొత్త అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ నంబర్లున్న బస్సులు ఆర్టీసీవి కావు. ఆర్టీసీ వారు ప్రైవేట్ వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకున్నవని అర్థం.