Priyanka Gandhi : తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు కాలం చెల్లిందని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు. పరీక్ష పేపర్ల లీకుల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మంచి విజన్ ఉందని తెలిపారు. రాజస్థాన్ లో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని.. అదే తరహాలో ఇక్కడ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. యువతకు రూ. 5 లక్షల ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు.
తెలంగాణలోని గ్రామాల్లో వైన్ షాపులు పెరిగిపోయాయని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వం వల్ల ధరలు పెరిగాయన్నారు. దీంతో ప్రజలు కష్టాలు పడుతున్నారని.. మహిళల కష్టాలను దూరం చేయడానికి రూ. 2500 లు ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్యాస్ సిలిండర్ రూ. 500 లకే ఇస్తామని చెప్పారు. కర్ణాటక మాదిరిగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.
తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం అన్నింటిపైనే జీఎస్టీ విధిస్తోందని మండిపడ్డారు. రైతులకు పంటలకు సరైన ధర రావడంలేదన్నారు. తెలంగాణలో భూమాఫియా భూములు దోచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని.. రైతులకు ఏటా రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధరపై గ్యారంటీ ఇచ్చారు.
తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు కాలం చెల్లిందన్నారు. ప్రజల ఆశలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడిందని ప్రియాంక గాంధీ వివరించారు. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో లేదో ఆలోచించాలన్నారు. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. మార్పురావాలి.. కాంగ్రెస్ రావాలి అని పిలుపునిచ్చారు. .
.
.
.